Home Unknown facts తాటకిని చంపినందుకు పాపపరిహారంగా రాముడు ప్రతిష్టించిన లింగం?

తాటకిని చంపినందుకు పాపపరిహారంగా రాముడు ప్రతిష్టించిన లింగం?

0

విశ్వామిత్ర మహర్షి, ఒకసారి ఒక దట్టమైన వనంలో యాగం చేయడానికి సంకల్పించారు. ప్రజలు సంతోషంగా జీవించడం నచ్చని తాటకి అనే రాక్షసి తన తమ్ముడైన మారీచుడిని మరియు మరి కొందరు రాక్షసులను పిలిచి యాగాలను ఛిన్నా భిన్నం చెయమని ఆజ్ఞాపించింది. మారీచుడు తదితరులు మహర్షులు లోక సమ్రక్షణార్ధం చేసే యాగాలను ప్రతీసారి ధ్వంసం చేసి మునులను కష్టాలపాలు చేసేవారు.

విశ్వామిత్రఎన్ని సార్లు యాగాన్ని మొదలు పెట్టినా ఏదో ఒక అవాంతరం వాటిల్లి యాగాన్ని ముగించలేక పోయారు మహర్షులు. ఈ అన్యాయాలకు తాటకి మూలకారకురాలని తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు తెలుసుకున్నారు. వెంటనే అయోధ్యకు వెళ్ళి దశరధమహారాజుని కలుసుకుని తాటకి చేస్తున్న అక్రమాలను అరికట్టడానికి బాలురైన రామలక్ష్మణులను పంపి, లోకాన్ని రక్షించమన్నాడు విశ్వామిత్రుడు.

రామలక్ష్మణులను రాక్షసిని సంహారం చేయడానికి పంపడానికి సంకోచించాడు దశరధమహారాజు. రాజ వంశ కులగురువైన వశిష్టుడు ధైర్యం చెప్పగా బాలురిని  విశ్వామిత్రుని వెంట అడవులకు పంపాడు దశరధమహారాజు. రామలక్ష్మణులు తమ ధనస్సు తీసుకుని విశ్వామిత్రుడి వెంట యాగశాల వున్న దట్టమైన అడవికి బయల్దేరారు. విశ్వామిత్రుడు మరో మారు యాగాన్ని ప్రారంభించాడు.

తాటకి తన అనుచర రాక్షసులతో అక్కడికి వచ్చింది. అసుర సంహారం కోసం వచ్చిన రాముడు యాగాన్ని ఆపడానికి వచ్చింది ఒక స్త్రీ అని తెలుసుకుని వెనుకడుగు వేసాడు.  విశ్వామిత్రుడు భుజం తట్టి రాక్షసి పై విల్లు ఎక్కుపెట్టమని ఆజ్ఞాపించాడు. మహర్షి మాట కాదనలేక బాణము గురిపెట్టాడు రాముడు.

రాముని బాణం భారీకాయురాలైన తాటకికి తగిలి నేలకొరిగింది. విష్ణుమూర్తి చేతిలో మరణించినందుకు  మోక్షం పొందింది తాటకి. తాటకి సంహారం గురించి తెలుసుకున్న మిగిలిన అసురులు పరుగులు తీశారు. యాగం మొదలైంది. నిరాటకంగా సాగింది. అసుర సంహార దోషపరిహారం కావించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్టించమని చెప్పాడు విశ్వామిత్రుడు. తాటకిని సంహరించినందుకు  శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకుని తగిన చోటు కోసం వెదికాడు రాముడు.

పెన్నానది ఒడ్డున అడుగుపెట్టిన రాముడు ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక బుగ్గలో కైలాసనాధుడు స్వయంభు లింగరూపంలో దర్శనమివ్వడంతో చాల ఆనందించాడు. పరుశురాముడు పూజించిన స్వయంభువు లింగం అదే అని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ట చేయమని చెప్పాడు. ఆ లింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు భక్తితో చేశాడు రాముడు. అసుర సంహారం వల్ల అదీ ఒక స్త్రీని సంహరించినందువల్ల పొందిన దోషం పరిహారమయ్యింది.

తాటకికి మోక్షప్రాప్తి లభించిన చోటే ఈనాడు తాడిపత్రిగా పరిగణించబడుతుంది. ఇక్కడ రాముడు ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన లింగాన్ని రామలింగం అంటారు. ఆలయము కూడా  నిర్మించబడింది. ఆలయ నిర్మాణం క్రీ.పూ 1475 సంవత్సరంలో ముగిసింది. బుక్కా రామలింగస్వామి ఆలయం పేరున పిలువబడుతుంది. ఒక అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం  ఇక్కడ చూడవచ్చు.

విశ్వామిత్రుడు యాగం జరిపిన అరణ్య ప్రాంతం తాడిపత్రికి దగ్గరలో వున్న కొండ చరియపై నెలకొన్న ఆలూరుకోన అని అంటారు. పురాణకధ ప్రకారం ఈ పుణ్యక్షేత్రం 14వ శతాబ్దంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు.

Exit mobile version