Home Unknown facts Shri lakshmi Narasimha Swamy ugra roopamlo darshanamichhe veyyinuthala kona

Shri lakshmi Narasimha Swamy ugra roopamlo darshanamichhe veyyinuthala kona

0

లక్ష్మి నరసింహ స్వామి వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడి ఈ ఆలయ ప్రాంతం వెయ్యి నూతుల కొనగా ప్రసిద్ధి గాంచింది. అంతేకాకుండా ఇక్కడ ప్రాంతంలో విశేషం ఏంటంటే కాకులు, గద్దలు సంచరించవు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.lakshmi narasimhaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో చిన్నదాసరిపల్లె గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ఉంది. వెయ్యి బావులు ఉన్న ప్రదేశం కావడంతో ఈ క్షేత్రం వెయ్యినూతుల కోన గా ప్రసిద్ధి గాంచింది.

వెయ్యినూతలకోనలో కాకులు, గద్దలు సంచరించవు. దీనికి ఒక పురాణ గాథను చెబుతారు. అదేమంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో దండకార్యణంలో ప్రవేశించినప్పడు సీతాదేవి ఒడిలో తల ఉంచి ఈ ప్రాంతంలో సేదతీరాడట. కాకాసురుడు అనే రాక్షసుడు పండు అని భ్రమించి సీతాదేవి తొడను ముక్కుతో పొడిచాడట. అది చూసిన రాముడు కోపంతో కాకాసురుడిపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడట. అప్పటి నుంచి ఈ క్షేత్రం పరిసరాలల్లోకి కాకులు, గద్దలు సంచరించవని పురాణగాధ.

 వెయ్యినూతలకోన క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి పల్లకిని మోస్తే మనసులో కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. ఉత్సవాల రోజు కోనేర్లుల్లో చక్కెర స్నానం చేస్తే పాపకర్మలు తొలగి పోతాయని క్షేత్రమహాత్మ్యం చెబుతోంది. అందువల్ల ఈ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 విజయనగర సామాజ్య కాలంలో వెయ్యినూతలకోన వెలసినట్లు అక్కడి శాసనాలు వివరిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలకాలంలో సాళువ మంగరాజు తల్లి జ్ఞాపకార్థం వెయ్యినూతలకోన క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి గుడికట్టించారు. అచ్యుత దేవరాయలు గుడిని దర్శించి 27 ఎకరాలు భూమిని మాన్యంగా ఇచ్చారు. తాళ్లపాక అన్నమాచార్యులు స్వామి వారిని సందర్శించి 10కి పైగా సంకీర్తనలు రచించారు.

 ఆనాటి పూజారులు వంశపారంపర్య ధర్మకర్త పిన్నపాటి వంశీయులు నిత్యం పూజలు, నైవేద్యాలు కొనసాగిస్తున్నారు. 2006లో లక్ష్మీదేవి ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టి, 2007లో పునఃప్రతిష్టించారు. 2009లో స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, పనులు పూర్తి చేశారు. భక్తులు, దాతల సహకారంతో చేపట్టిన ఈ రెండు ఆలయాల జీర్ణోద్ధరణకు దాదాపు రూ.2.50 కోట్లు వెచ్చించారు. అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడే ఈ ఆలయాలను సందర్శించడానికి రెండుకళ్లూ చాలవనిపిస్తుంది.

ఇలా ప్రకృతి అందాల నడుమ వెలసి కోరిన కోరికలు నెరవేరుస్తూ ఈ పుణ్యక్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Exit mobile version