Home Unknown facts తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకు ?

తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకు ?

0

ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొవడమే ఉత్థాన ఏకాదశి అంటారు.

తొలి ఏకాదశితొలి ఏకాదశి అన్ని ఏకాదశుల్లోకి ఉత్తమోత్తమమైంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది.స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం,పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించేది ఈ ఏకాదశి రోజే. ఆషాఢమాసంలో వచ్చే ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని శయనైకాదశి అని కూడా సంభావిస్తారు. స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తాడనే ప్రజలందరూ జనార్దనుని కోసం కటికోపవాసం చేస్తారు.

కాబట్టి నిర్జలైకాదశిని అనీ, హరి దగ్గరే వాసం చేస్తారు కాబట్టి హరివాసరం అని శయనై కాదశిని వ్యవహరిస్తారు. ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షిణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. కాబట్టి ప్రత్యక్షనారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి శయనైకాదశిని పిలవడానికి కారణంగా చెప్తారు. శయనైకాదశి ఉపవాసవివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెబుతుంది. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.

శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అను రాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసి శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు. గోముఖభాగంలో వేదాలు, కొమ్ముల్లో హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, నాలుక పైన సరస్వతి, పూర్వభాగంలో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి, అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వదేవతా నివాసస్థానమైన గోవును కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు. అధర్వణవేదం, బ్రహ్మాండ,పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టత తెలుపుతాయ. గోశాలలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులుతీర్చి మధ్యలో ముప్పైమూడు పద్మాల ముగ్గులువేసి శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. పద్మానికొకఅప్పడం చొప్పున వాయనాలు దక్షిణతాంబూలాలనిస్తారు.

మహావిష్ణువుకు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి వివిధరకాల పండ్లను నివేదిస్తారు.ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు, అంబరీషుడు కూడా పాటించారు. వాళ్లు పాటించడమే కాకుండా వారి రాజ్యాల్లోని ప్రజలందరి చేతకూడా ఏకాదశవ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశవ్రతం చేసేవారి పట్ల సదా మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు. బంధుమిత్రులందరు కలసి సాయంత్రపుపూట సామూహిక విష్ణుసహస్రనామావళిని పఠిస్తారు. హరిభజన చేస్తారు. చాతుర్మాస వ్రతానికి ఆరంభం ఈరోజు. దీనిని గురించి బ్రహ్మవైవర్తన పురాణం వివరిస్తుంది. ఈ రోజున పిప్పల వృక్షాన్ని ప్రదక్షణ చేయడం కూడా మంచిదని అంటారు.

చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మపండ్లు, అలసందెలు,ముల్లంగి, గుమ్మడికాయ,చెరకుగడలు వర్జించాలని అంటారు. మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశాయపైన పవళిస్తాడని యతులు సన్యాసులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని వెచ్చిస్తుంటారు. దేశ సంచారులైన యతులు ఈ నాలుగునెలలూ ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోను చాతుర్మాస వ్రతమున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయదారుల పండుగగా భావిస్తారు. కొత్త పాలేర్లను పనికి పెట్టుకుంటారు.పాలేర్లందరికీ కొత్తబట్టలిచ్చి వారిని గౌరవిస్తారు.

 

Exit mobile version