దశమహావిద్యలు అని పేర్కొనబడిన మంత్రవిద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు. ఈ దశమహావిద్యలలో ఏడవ అవతారం అతి విచిత్రమైన అవతారం. తాంత్రికులు ఎక్కువగా సిద్ధిని పొందటానికి ఈమెను స్మశానాలలో రాత్రివేళలలో పూజిస్తుంటారు. మరి దశమహావిద్యలు ఏంటి? విచిత్ర అవతారం గల అమ్మవారు ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శివుని భార్య అయిన సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యజ్ఙంకు వెళ్ళుటకు నిర్ణయించుకుని పరమ శివునితో చెప్పగా, శివుడు దక్షప్రజాపతి ఆంతర్యము తెలిసినవాడు కనుక పిలుపు లేని చోటుకు వెళ్ళరాదని వారించెను. అప్పుడు వెంటనే సతీదేవి కోపంతో పరమ శివునికి తన నిజరూపమైన ఆదిపరాశక్తి అవతారము దాల్చి మహా శివుని ముందు తన శక్తితో 10 అవతారాలతో 10 వైపులా శివుని అడ్డుకుంది. ఈ 10 అవతారాలే దశమహావిద్యలు. ఈ అవతారాలలో అమ్మవారు ఒక వైపు భయంకర రూపంతో కనిపిస్తూనే మరోవైపు అందమైన శక్తి స్వరూపిణిగా సర్వ విద్యలకు అధినాయకిగా చెప్పబడినది. దశమహావిద్యలు పేరుకు తగ్గట్టుగ అపారమైన జ్ఙాన మూర్తులుగా తెలుపబడ్డారు. ప్రతి ఒక అవతారము ఒక ప్రత్యేకతను కలిగి ఉంది.
దశమహావిద్యలలో అతి విచిత్రమైన అవతారం ధూమవతి. ఈమె ఒక వితంతువుగా కనిపిస్తుంది. దీనికి వెనుక ఒక కథ ఉంది, ఒక నాడు పరమశివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి ఆకలిగా ఉంది అని అడుగగా శివుడు వేచి ఉండమని చెప్పాడు, మరల కొంత సమయం గడిచాక పార్వతిదేవి శివుని చూచి ఆకలి అని అడుగగా శివుడు మరల వేచి ఉండమని చెప్పెను, అది విని పార్వతిదేవి మిక్కిలి కోపంతో శివుని మ్రిగేసింది. ఆమెలో ఉన్న శివుడు కోపంతో మూడోకన్ను తెరచి పార్వతిదేవితో ఇలా అన్నాడు ఈ లోకంలో పురుషుడు అనే వాడు ఉండడు అనెను, దాని ప్రతిఫలమే ఆమె వితంతువు రూపం. శివుడు మూడో కన్ను తెరువగా ఆమెలో నుండి పొగ రాసాగింది అందువల్లనే ఆమెకు ధూమవతి అని పేరు వచ్చినది అని చెబుతారు.
ఈమె చూడటానికి వికారంగా, చేతిలో చాటతో, పొగసూరిన బట్టలతో, మెల్లకళ్ళతో, గుర్రంలేని బండిపై కూర్చుని ఉంటుంది. ఈమె వికారమైన రూపం మనకి సౌందర్యాన్ని మించింది ఎంతో ఉందని తెలియజేస్తుంది. ఇక ధూమవతి సిద్ధిని ప్రసాదించే తల్లి. ఈమెను ముఖ్యంగా వితంతువులు, పెళ్ళికాని వారు పూజిస్తుంటారు. ఈమెకు చాలా అరుదుగా గుడులు ఉంటాయి. తాంత్రికులు ఎక్కువగా సిద్ధిని పొందటానికి ఈమెను స్మశానాలలో రాత్రివేళలలో పూజిస్తుంటారు. ఈమెను చూస్తేనే ఎవరికైనా తీవ్రమైన భయాందోళనలు కలుగుతాయి. కానీ ఈమెను ఆరాధించేవారికి అపూర్వమైన వరాలను ఇచ్చి ఆదరిస్తుంది.