ప్రస్తుత రోజుల్లో మనం తీసుకునే ఆహారం మీద పూర్తి కాన్షియస్ గ ఉండాలి. మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, మనం తినే తిండిలో ఏఏ పోషకాలున్నాయి, ఎన్ని కేలరీలు ఉన్నాయి…అసలు మనకు ఎన్ని కేలరీలు సరిపోతాయి, వాటిని అరిగించుకోవడానికి ఎంత పనిచేయాలి… ఇలాంటివన్నీ నిత్య జీవనంలో తప్పక చూసుకోవాల్సిన అంశాలు… వీటి గురించి అవగాహనను పెంచుకుంటే, తద్వారా ఆరోగ్యం పెరుగుతుంది.. . అయితే వీటితో పాటు కొన్ని ఆహార పదార్ధాల గురించి కూడా మనం తెల్సుకోవాలి.. ఆరోగ్య నిపుణులు, కొన్ని పదార్థాలను కలిపి మాత్రం తినకండి అని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..
భోజనంతో పాటు పళ్లను కలిపి తీసుకోకూడదట. ఎందుకంటే పళ్లు త్వరగా జీర్ణమై పోతాయి. పళ్లను పప్పు దినుసులు మాంసం వంటి ఆహారంతో పాటు తీసుకుంటే ఈ ఆహారం అరిగేవరకు అవి కూడా వాటితో పాటు జీర్ణమయ్యే ప్రకియలో నిలిచి ఉంటాయి. దాంతో అప్పటికే జీర్ణమైపోయి ఉన్న పళ్లు పులిసిపోతాయి. దీనివలన మన పేగుల గోడలకు హానితోపాటు, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
మాంసాహారం, పిండి పదార్థాలు
మాంసాహారంలోని ప్రొటీన్లు, పిండి పదార్థాల్లోని కార్బోహైడ్రేట్లు… కలిపి తీసుకుంటే వీటిని అరిగించడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేసే భిన్న ఎంజైములు కలిసి పోతాయి. ఇలా కలవడం వలన గ్యాస్, కడుపు ఉబ్బరం ఇంకా పలురకాల సమస్యలు వస్తాయి.
దగ్గుమందు, నిమ్మరసం
ఈ రెండింటినీ ఒకేసారి పొట్టలోకి చేర్చకూడదు. దగ్గుమందు, నిమ్మరసం కలిపి తీసుకుంటే అనుకోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. నిద్రలేమి, భ్రాంతుల వంటివి కలుగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే దగ్గుమందుని వాడేటప్పుడు తప్పనిసరిగా వైద్యుని సలహాతోనే వాడాలి..
టమాటాల వంటి ఆమ్లతత్వం ఉన్న కూరగాయ. బియ్యం, చిలకడ దుంపలు లాంటి చిక్కటి పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని కలపకూడదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వలన అరుగుదల సమస్యలతో పాటు, గ్యాస్ సంబంధిత అనారోగ్యాలు సైతం తలెత్తుతాయట. ఒక్కోసారి ఇలా కలపి తినడం వలన భోజనం తరువాత మనకు విసుగు, అలసట లాంటి సమస్యలు కూడా ఉంటాయట. దాదాపు ప్రతి రోజూ అన్నంతో పాటు ఏదో ఒక రూపంలో టమాటాని తీసుకునే అలవాటున్నవారు దీని గురించి కాస్త ఆలోచించాల్సిందే.
పాల ఉత్పత్తులు, పళ్లు ఇవి రెండూ కలిస్తే ఒక సమస్యల ప్రపంచమే తయారవుతుందట. పాలకు కఫము, దగ్గు, జలుబు, ఎలర్జీ లాంటి లక్షణాలను పెంచే గుణం ఉంది. ఇలాంటి సమస్యలున్నప్పుడు పాలు, పెరుగుల్లో పళ్లను కలిపి తీసుకుంటే ఆయా సమస్యలు మరింత తీవ్రరూపం దాలుస్తాయి.
బియ్యం, జొన్నలు, సజ్జలు, గోధుమ లాంటి వివిధ రకాల ధాన్యపు ఆహారాలను, పాలను కలిపి తీసుకుంటే అది అంతగా మన శరీరానికి మేలుచేయదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ధాన్యంతో తయారయిన ఆహారం, పాలు…ఈ రెండింటిలోనూ త్వరగా జీర్ణమైపోయే కార్బోహైడ్రేట్లే ఉండటం వలన, వీటిని టిఫిన్గా తీసుకుంటే మన శరీరం త్వరగా ఆకలి, అలసటలకు గురవుతుందట. ఈ రెండు ఆహారాలూ రక్తంలో షుగర్ పాళ్లను పెంచుతాయని, అంతేకాకుండా షుగర్ సాధారణ స్థితికి వచ్చాక జంక్ఫుడ్ని తినాలనే తపనని ఇవి పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆల్కహాల్ని తీపి పదార్థాలతో కలిపి తీసుకుంటే విపరీత సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందట. ఇలా తీసుకుంటే కొన్ని పరిణామాల తరువాత శరీరంలో కొవ్వు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. తీపి పళ్లు, పదార్థాలను కాకుండా పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవడం మంచిది.
ఇక ఇప్పటి పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్ బర్గర్. ఎక్కువ ఉడికించడం, కొవ్వుతో కూడిన పదార్థాలు, నిలవ ఉంచేందుకు వినియోగించే రసాయనాలు ఇవన్నీ కలిసిన బర్గర్, శరీరంలో కొలెస్ట్రాల్ని పెంచేస్తుంది. ఇలాంటి బర్గర్కి పొటాటోలోని షుగర్ కలిస్తే వాపుకి, వేగవంతమైన వృద్ధాప్యానికి కారణమయ్యే సైటోకిన్స్ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినకుండా ఉంటే మంచిది.