హిందువులు లక్ష్మీ దేవిని ఎంతగా పూజిస్తారో అందరికీ తెలిసిందే. తమకు ధనం సిద్దించాలని, అదృష్టం కలగాలని, ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కలగాలని లక్ష్మీ దేవిని ప్రార్థిస్తారు. ఈ క్రమంలో కొందరికి కోరుకున్నట్టుగానే ఐశ్వర్యం కలుగుతుంది. అయితే లక్ష్మి దేవి అక్క గురించి మనలో చాలా మందికి తెలియదు. అవును, ఆవిడ కూడా ఉంది. ఆమె పేరు అలక్ష్మి. అయితే శ్రీమహావిష్ణువు ఆమెకు పెళ్లి చేసేందుకు నానా కష్టాలు పడ్డాడట. ఇంతకీ అసలు కథ ఏమిటంటే…
సముద్ర దేవుడికి లక్ష్మి, అలక్ష్మి ఇద్దరు కూతుర్లు ఉండేవారు. దేవతలు, రాక్షసులు ఆదిశేషువును తాడుగా చేసుకుని, మందన పర్వత్వాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మధిస్తారు. అప్పుడు దాంట్లో నుంచి అనేక వస్తువులు మాత్రమే కాదు, దేవతలు కూడా ఉద్భవిస్తారు. వారిలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది. దీంతో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తాడు. అయితే లక్ష్మీదేవి అందుకు నిరాకరిస్తుంది. కారణం అడగ్గా, తన కన్నా ముందు పెళ్లి కాని అక్క ఉందని ఆమెకు పెళ్లి అయితేనే తాను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. దీంతో విష్ణువు లక్ష్మీదేవి అక్క అయిన అలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తాడు. అయితే ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం నిలవదట. ధనం ఆగదట. అలక్ష్మి ఉన్న చోట సిరి సంపదలు కోల్పోతారు. మరి అలాంటప్పుడు తెలిసి తెలిసి ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు.
అయితే వెతగ్గా వెతగ్గా అలక్ష్మికి ఓ వరుడు దొరుకుతాడు. అతను ఉద్దాలకుడు. ఆయన ఓ మహాముని. ఆయనకి ఎటువంటి సంపదల మీద వ్యామోహం లేదు. ఆయన అలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. దీంతో కథ సుఖాంతం అవుతుంది. ఆ తరువాత లక్ష్మీ దేవి విష్ణువును పరిణయమాడుతుంది. లక్ష్మిని వివాహం చేసుకున్న తర్వాత దేవతలందరికీ సిరి సంపదలు వస్తాయి. అయితే ఉద్దాలకుడితో వెళ్లిన అలక్ష్మి ఆయన ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం వద్దే ఆగుతుంది. ఉద్దాలకుడు ఎందుకని అడుగుతాడు. దానికి సమాధానంగా తాను శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉండనని, మురికిగా, అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉంటానని, దుస్తులు కూడా అలాగే ఉండాలని చెబుతుంది.
అంటే ఏ ఇంట్లో అయితే మురికిగా, అశుభ్రంగా ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉంటుందన్నమాట. ఆ ఇంట్లో డబ్బు నిలవదని మనకు తెలుస్తుంది. అందుకే ఎవరైనా తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన దుస్తులను వేసుకోవాలి. అప్పుడే లక్ష్మి నిలుస్తుంది. అంతేకాదు, ఇళ్ల గుమ్మాల్లో మిరపకాయలు, నిమ్మకాలను గుత్తిగా వేలాడదీసి గుమ్మాలకు కడతారు. అది కూడా అలక్ష్మి కోసమేనట. ఇంటి వద్దకు వచ్చిన అలక్ష్మికి ఆ ఆహారం అంటే ఇష్టమట. పుల్లగా, వగరుగా, కారంగా ఉండే ఆహారం అంటే ఆమె ఇష్టపడుతుందట. అందుకే వాటిని గుమ్మాల వద్ద వేలాడదీస్తారు. ఒక వేళ అలక్ష్మి వస్తే వాటిని తినేసి ఇక ఆ ఇంట్లోకి వెళ్లకుండా బయటికి పోతుందని అందరూ నమ్ముతారు. అందుకే ఆ వస్తువులను చాలా మంది ఇళ్లు మాత్రమే కాదు, ఆఫీసులు, షాపుల్లోనూ వేలాడదీస్తారు.
ఇక లక్ష్మీదేవిని పూజించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకోటుంది. అది ఏమిటంటే భక్తులు ఎప్పుడూ తామర పువ్వులో కూర్చుని ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని, ఫొటోనే పూజించాలి. దీంతోనే ధనం లభిస్తుంది. ఐశ్వర్యం కలుగుతుంది. అలా కాకుండా గుడ్లగూబ పక్కన ఉన్న లక్ష్మి ఫొటో లేదా లక్ష్మీ దేవి నిలబడి ఉన్న ఫొటోలను అస్సలు పూజించరాదు. అలా పూజిస్తే నష్టం కలుగుతుందట. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయట.