శ్రీ కృష్ణుడు తలపైన నెమలిపింఛం, చేతిలో ప్రిలన గ్రోవి పట్టుకొని దర్శనం ఇస్తుంటాడు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహానికి మీసాలు అనేవి ఉంటాయి. అందుకే ఇక్కడ కొలువై ఉన్న ఈ స్వామిని మీసాల వేణుగోపాలస్వామి అని పిలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న మరిన్ని ఆశ్చర్యకర విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా. దుబ్బాక మండలం, చెల్లాపూర్ నందు మీసాల వేణుగోపాలస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఈ ఆలయంలోని వేణుగోపాలస్వామికి మీసాలు ఉంటాయి. అందుకే ఈ ఆలయం చాలా ప్రత్యేక ఆలయంగా గురించబడింది. ఇక పురాణానికి వస్తే, సుమారు 200 సంవత్సరాల క్రితం దుబ్బాక గ్రామం దొరల పాలనలో ఉండేది. అయితే దొరలు పన్నులు కట్టమని ప్రజలను విపరీతంగా వేధిస్తూ ఉండేవారు. అప్పుడు ఇక్కడి గ్రామస్థులు అందరు ఒకటై దొరలకి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకొని, ప్రజలందరూ ఒకటై పన్నులు చేసే అధికారులను తరిమికొట్టగా, అప్పుడు అధికారులు పెద్ద సైన్యంతో గ్రామం పైన దాడిచేసి గ్రామస్థులని వేదించసాగారు. ఆ సమయంలో గ్రామస్థులకు ఒక ఆలోచన అనేది వచ్చి దొర దగ్గరికి వెళ్లి మేము ఈ స్థలంలో వేణుగోపాలస్వామి వారి దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాం కావున మేము పన్నులు కట్టలేము అని చెప్పారు. అయితే ఆ దొర కూడా శ్రీకృష్ణుడి భక్తుడు కావడంతో దొరకుడా కొంత డబ్బు సహాయం చేసి అతను ఆ ప్రదేశాన్ని వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఆవిధంగా ఇక్కడ శ్రీ రాజా వేణుగోపాలస్వామి ఆలయం నిర్మింపబడింది. అయితే ఈ ఆలయం గురించి మరొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఆలయ నిర్మాణం కోసం ప్రజలు చందాలు వసూలు చేసారు కాని విగ్రహాన్ని తయారుచేయించడం చాలా కష్టమైనది. అందువలన ప్రక్క ఊరిలో పూజించకుండా ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ఆ గ్రామస్థులకు చెప్పకుండా తీసుకువస్తుండగా ఆ గ్రామస్థులు వీరిని చూసి వెంబడించగా, స్వామి వారి విగ్రహాన్ని చెల్లూరు కోనేరులో దాచారు. ఆ తరువాత కొంతకాలానికి వేణుగోపాలస్వామి వారి ఆలయం పూర్తవ్వగానే వారు కోనేరులో దాచి ఉంచిన విగ్రహాన్ని బయటకు తీసి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆలయంలో ప్రతిష్టించారు. స్వామివారికి మీసాలు మరియు తల మీద కిరీటం ఈ మార్పులలో చోటుచేసుకున్నాయని చెబుతారు. ఇక ఈ ఆలయ ఆవరణలో ఒక కోనేరు, రెండు ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నవి. ఈ స్వామి వారి ఆలయంలో అఖండ దీపారాధన నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఇలా శ్రీకృష్ణుడు మీసాలతో కనిపించే ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.