శ్రీ రాముడు వెలసిన ఆలయాలలో ఈ దేవాలయం ప్రత్యేకమైనదిగా చెబుతుంటారు. ఇక్కడి ఆలయంలో శివుడు, సాయిబాబా కూడా భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని చేవెళ్లకు వెళ్లే హైదరాబాద్ ప్రధాన రహదారి మార్గంలో లంగర్ హౌస్ ప్రాంతంలో బాపూఘాట్ కు సమీపంలో శ్రీ విజయరాఘవస్వామి దేవాలయం ఉన్నది. ఈ ఆలయం సుమారు 800 ఏళ్ళ క్రితం నాటిదిగా తెలుస్తుంది. అయితే రామదాసుని చెర విడిపించేందుకు శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా తానీషాకు ఆరులక్షల రూపాయలు జమకట్టి రసీదు పుచ్చుకొని అనంతరం ఈ ఆలయంలో సుప్రతిష్ఠితుడైనాడని భక్తుల నమ్మకం. అందుకే మరెక్కడా లేనివిధంగా ఇక్కడ శ్రీరాముడు వీరవెంకట విజయరాఘవస్వామిగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. గర్భగుడిలోని రాముడు మీసాలతోపాటు, శంఖు, చక్రాలతో, చతుర్భుజాలతో భక్తులకి దర్శనమిస్తుంటాడు. కుడి, ఎడమల లక్ష్మణ, సీతా సమేతుడై రాముడు ఇక్కడ కొలువై ఉన్నాడు.ఈ ఆలయ కుడ్యాలపై దశావతార మూర్తులు ఉన్నాయి. ఎత్తైన ధ్వజస్థంభం, గోపురం, ప్రాకార పైభాగాన ఆంజనేయమూర్తితో ఆలయస్థావరం ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో వసంత నవరాత్రులలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పునర్వసు నక్షత్రంలో స్వామి జన్మదినోత్సవం, శుక్రవారాల్లో తిరుమంజన సేవలు జరుగుతాయి. ఒకే గర్భాలయంలో దక్షిణాన నరసింహస్వామిగా, ఉత్తరాన శ్రీకృషునిగా, తూర్పున సీతాలక్ష్మణ సమేత రఘునాయకునిగా స్వామి విరాజిల్లుతున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో మరికొందరు దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ వేంకటేశ్వరస్వామి మందిరం ఒకటి. ఇంకా హనుమాన్ ఆలయంలో పంచముఖ హనుమాన్ కొలువుదీరి ఉన్నాడు. సిద్ది బుద్ది సమేత స్వర్ణమయ వినాయకుడు ఇక్కడ దర్శనమిస్తాడు. అదేవిధంగా శివాలయంలో శివుడు స్పటిక శివలింగ రూపంతో దర్శనమిస్తాడు. ఇంకా సాయిబాబా మూర్తి, నవగ్రహ మంటపాలు కూడా కలవు. ఇలా ఎక్కడ లేని విధంగా శ్రీరాముడు దర్శనమిచ్చే ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.