పరమేశ్వరుడు తన ఆత్మశక్తితో లింగరూపంలో నింపి, మన దేశంలో పన్నెండు చోట్ల ఉన్న శివలింగరూపమూర్తులను ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునస్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అయితే ఈ స్వామివారి ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో భ్రమరాంబా అమ్మవారి ద్రుష్టి నేరుగా శివలింగంపై ఉండేటట్లుగా నిర్మించబడింది. మరి ఆ అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు? ఈ ఆలయం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కర్నూలుకు తూర్పుదిశలో సుమారు 70 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో శ్రీశైలమునందు సముద్రమట్టానికి 458 మీ. ఎత్తున కొండపైన వెలసిన అతి పురాణ ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం ఇది. ఇక్కడ వెలసిన శివుడి పేరు మల్లికార్జునుడు, అమ్మవారి పేరు భ్రమరాంబిక. ఇక్కడ వెలసిన భ్రమరాంబిక దేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠంగా నిలిచింది.
ఇక పురాణానికి వస్తే, పరమేశ్వరుడి సౌమ్యతకు, మనోహర రూపానికి పరవశించి పోయి వివాహమాడాలనుకున్నది భ్రమరాంబిక దేవి. అయితే అక్కడే భ్రమిస్తున్న తేన టీగను చూపి అది విశ్రమించే వరకు దానిని అనుసరిస్తే వివాహమాడతాను అని శివుడు చెప్పడంతో దానివెనుక ఆ దేవి పరిగెత్తింది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాల పాటు పరిగెత్తాల్సి వచ్చింది. ఇక చివరకు ఆ భ్రమరం ఇక్కడ విశ్రాంతి తీసుకుంది. అప్పుడు శివుడు ఒక వృధ్దినిగా వచ్చి, చాలాకాలం గడిచినందున వృధ్దిడిని అయ్యాను నేను వివాహానికి తగను అని చెప్పగా, వ్యక్తి ఆత్మ సౌందర్యాన్ని ఆదరించే ఆమె అభ్యంతరం లేదని వివాహానికి అంగీకరించింది. ఇలా భ్రమరాన్ని అనుసరించడం వల్ల ఆమెకు భ్రమరాంబిక అని పేరు స్థారకమైంది. ఇప్పటికి కూడా భ్రమర ఝంకారం భ్రమరాంబిక దేవి కొలువై ఉన్న గుడి వెనుక మనం వినవచ్చును అని భక్తుల నమ్మకం.
ఇక ఈ అమ్మవారి ఆలయం ఆధ్భూతమైన శిల్పకళతో అందమైన శిలాపతోరణాలతో కూడిన స్థంబాలతోను ఆధ్బుతంగా ఉంటుంది. సంక్రాంతికి పార్వతీదేవి కల్యాణోత్సవం, శివరాత్రినాడు శ్రీ భ్రమరాంబా కల్యాణోత్సవం జరుగుతాయి. ఇక్కడ మహాశివరాత్రి నాడు జరిగే ఉత్సవములు, ఉగాదికి, చైత్రమాసంలో జరిగే చండీయాగం, కుంభోత్సవములు చాలా వైభవంగా జరుగుతాయి.
ఇలా శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమరాంబిక దేవిని భక్తులు దర్శించి తరిస్తారు.