మన హిందూ సంప్రదాయంలో సకల దేవతాగణములకు అధిపతి గణపతి. అందరు అన్ని కార్యములకు, పూజలకు మొదటగా పూజించేది గణపతిని. ఈ స్వామిని వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు అంటూ ఎన్నో రకాలుగా భక్తులు పిలుస్తుంటారు. అయితే గణపతి 36 రూపాలు ఉండగా అందులో 16 మాత్రం చాలా ప్రముఖమైనవిగా చెబుతారు. ఇక ఇక్కడ వెలసిన ఈ స్వామిని కమండల గణపతి అని అంటారు. మరి ఈ స్వామికి ఆ పేరు ఎందుకు వచ్చినది? ఇక్కడ తీర్దానికి ఎందుకు అంత ప్రత్యేకత? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం, చిక్కమగళూరు జిల్లా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కమండల గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు. ఇక్కడే తుంగ ఉపనది బ్రహ్మ ఉంది. ఇక్కడి తీర్ధాన్ని సేవిస్తే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయనేది భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ జన్మించిన బ్రహ్మ నది కొంత దూరం ప్రయాణించి తుంగ నది లో కలుస్తుంది.
ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, శని వక్రదృష్టి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలనీ భావించి శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్దించినదట, అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు ఒక తిర్దాన్ని సృష్టించాడని పురాణం. ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించిన వినాయకుడు సృష్టించిన తిర్దాన్ని బ్రహ్మ తీర్థం అని, కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరు వచ్చినది స్థల పురాణం. ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.
ఇక ఈ ఆలయం దగ్గర నీటి ధార అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే కొండలో నుండి భూగర్భంలోకి చేరుకొని కుండికలో ప్రత్యేక్షమయ్యే నీటిలో అనేక రకాల ఔషధ విలువలు ఉంటాయని చెబుతారు. ఇలా ప్రకృతి ఒడిలో దట్టమైన అరణ్యంలో ఉండే ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి వచ్చి కమండల గణపతిని దర్శించి, ఇక్కడ పుణ్యతీర్ధంలోని నీటిని తాగి ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి నిత్యం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.