టంగుటూరి ప్రకాశం పంతులు:
స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ తూటాలకు ఎదురువెళ్ళి నిలబడి చొక్కా గుండీలు తీసి తన గుండెని చూపించి ఇక్కడ కాల్చు అని చెప్పిన విప్లవ జ్యోతి, గొప్ప దేశ భక్తుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేసిన అతి తక్కువ మందిలో అయన ఒకరు, ఇంకా తెలుగు వారిలో బారిస్టర్ చదివిన మొదటి వ్యక్తి ప్రకాశం గారు. మరి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అయన ఉద్యమం వైపు అడుగులు ఎలా వేశారు? అయన ఉద్యమం ఎలా సాగిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగష్టు 23 న ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెం గ్రామంలో సుబ్బమ్మ, వెంకట నరసింహం దంపతు లకు జన్మించారు. వీరిది ఒక మధ్య తరగతి కుటుంబం. అయన 11వ యేట తండ్రి మరణించడంతో, తన తల్లి ఒంగోలు చేరి భోజనశాల నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది. అయితే తన తల్లి సంపాదన సరిపోకపోవడంతో, ప్రకాశం గారు ధనికుల ఇళ్ళల్లో పనిచేసేవారు. ఆయనకి నాటక రంగం పైన ఇష్టం ఉండటంతో చిన్న వయసులోనే నాటకాలు వేసేవారు. ఇక తన గురువు హనుమంతరావు నాయుడు సహకారంతో ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీ గా చదివారు. ఆ తరువాత తన గురువు తో కలిసి రాజమండ్రి వెళ్లగా ఎఫ్.ఏ. లో చేరాడు. ఆయనకి తన చిన్నతనం నుండి కూడా న్యా యవాది కావాలని కలలు కనేవారు. అయితే మెట్రిక్ తప్పడంతో మద్రాసు చేరి సెకండ్గ్రేడ్ ప్లీడర్గా పనిచేసి, ఎంతో శ్రద్దగా చదివి లా పూర్తిచేశారు. లా పూర్తి చేసినతరువాత రాజమండ్రి తిరిగి వచ్చి న్యాయవాదిగా మంచిపేరు సంపాదించారు.
ఇలా ఉండగా 1904లో 31 ఏళ్ల వయసులోనే రాజమండ్రి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. కానీ న్యాయవాద వృత్తి మీద ఉన్న మమకారంతో లండన్ వెళ్లి బారిస్టర్ చేశారు. ఆ సమయంలో రాయల్ ఇండియా సొసైటీలో చేరి హౌస్ ఆఫ్ కామన్కు దాదాబాయ్ నౌరోజీ ఎన్నికకు తోడ్పడ్డారు. బారిస్టర్ పూర్తి కాగానే మద్రాసు చేరి న్యాయవాద వృత్తి ప్రారంభించి 14 సంవత్సరాల పాటు న్యాయవాదిగా చేసి మంచి పేరు ఎంతో డబ్బుని సంపాదించారు. అయితే న్యాయవాదిగా చేస్తున్న సమయంలోనే అయన స్వాత్యంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఇలా ఉద్యమంలో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ న్యాయవాది వృత్తి ని వదిలేసి అప్పటికే అయన సంపాదించినా డబ్బులన్నీ అన్ని కూడా దేశ సేవకోసం ఖర్చు చేసిన గొప్ప దేశ భక్తుడు ప్రకాశం గారు.
అయన న్యాయవాద వృతి నుండి బయటికి వచ్చిన తరువాత స్వరాజ్య అనే పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. ఈ పత్రిక ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో పత్రికలను విడుదల చేసేది. ఈ పత్రిక చాలా కొద్దీ కాలంలోనే మంచి ఆదరణ పొందింది. దీంతో పాటు అయన ఒక జాతీయ పాఠశాలని, ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నడిపారు. ఇక 1921లో అహ్మదాబాద్ సదస్సులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై దేశవ్యాప్తంగా తిరుగుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 1922లో గుంటూరులో 30 వేల మందితో భారీ ప్రదర్శనను నిర్వహించారు. ఆ తరువాత 1926లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై శాసనసభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా గాంధీజీ పిలుపు మేరకు మన రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషను బహిష్కరణ ఉద్యమంలో ఒక ఉద్యమ కారుడు చనిపోగా, ఆ మరణించిన వ్యక్తి దగ్గరికి ఎవరిని కూడా అనుమతించకపోవడం చూసి చాలించిన ప్రకాశం గారు పొలిసు వలయాలను నెట్టి వేసి ఆ అమరవీరుడి దగ్గరికి వెళుతూ చొక్కా గుండీలు తీస్తూ తెల్లోడి తుపాకికి తన గుండెని చూపించి కాల్చమని సవాలు చేసాడు. అందుకే ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.
ఇక 1937లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో రెవెన్యూ శాఖమంత్రిగా పనిచేస్తుండగా, మన దేశంలో ఎవరిని సంప్రదించకుండానే బ్రిటీష్ ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ను భాగస్వామిని చేసింది. అందుకు నిరసనగా అప్పటి ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అయన 1942 నుంచి 1945 వరకు జైలు జీవితం గడిపి విడుదలైన తరువాత ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు దక్షణ భారతదేశమంతా తిరిగారు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ పార్టీలో ఉన్న కొందరి కారణంగా అందులోనుండి బయటికివచ్చి స్వంతంగా 1952లో హైదరాబాద్ రాష్ట్ర ప్రజాపార్టీని ప్రారంభించారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన విజయం సాధించలేదు.
ఇది ఇలా ఉన్న సమయంలోనే ప్రత్యేకరాష్ట్రం కోరుతూ పొటి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఫలితంగా 1953 అక్టోబర్ ఒకటిన ఆంధ్రరాష్ట్రం ఏర్ప డింది. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ ఆయన ఏడాది కాలం మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కమ్యూనిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, సోషలిస్టులు దూరం కావడం, ఆయనపై వచ్చిన ఆరోపణల ఫలితంగా ప్రకాశం గారి ప్రభుత్వం పడిపోయింది. ఆ తరువాత మధ్యంతర ఎన్నికలు జరిగినప్పటికీ 1955 నుంచి ప్రకాశం పంతులు గారు రాజకీయాలకు క్రమంగా దూరమయ్యారు. హరిజనుల సమస్యలపై దృష్టి సారించి రాష్ట్రం వ్యాప్తంగా పర్యటించారు. అప్పటికే ఆయన ఆర్థికంగా చితికిపోయారు. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాలనుండి దూరమైనప్పటికీ ప్రకాశం పంతులు గారు రాష్ట్రమంతటా పర్యటించారు. ఇలా రాష్ట్రము అంత పర్యటిస్తుండగా ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రి లో చేరగా, 1957, మే 20న మరణించారు. ఆయన చేసిన సేవలకు 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
ఆ రోజుల్లోనే కొన్ని లక్షల సంపాదన వస్తున్నప్పటికీ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలనే ఉద్దేశంతో తన వృత్తిని వదిలి, అప్పటికి సంపాదించినా కొన్ని లక్షల రూపాయలను దేశ సేవకే ఖర్చు పెట్టి, తెల్లోడి తుటాకి గుండెని చూపించిన తెలుగు సింహం, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రతి ఒక్కరికి ఆదర్శం.