శివాలయాలకు భారత దేశం పెట్టింది పేరు. ఊరికొక శివాలయం ఉంటుంది. అతి పురాతన శివాలయాలు కూడా చాలానే ఉన్నాయి. అంతుచిక్కని రహస్యాలతో ఎన్నో ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. అందులో ఎప్పటికీ ఎవరికీ తెలియని రహస్యాలు, అద్భుతాలు దాగి ఉన్నాయి.
ఈ ఆలయాలలో ఉన్న ఈ రహస్యాల గురించి ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పటికీ వాటిని గుర్తించలేకపోయారు. అలాంటి వింతలు దాగి ఉన్న ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఒక వింత కలిగినటువంటి అతిపురాతన ఆలయం కొన్ని సంవత్సరాల క్రితం తాజాగా బయటపడింది.
అయితే ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ ప్రత్యేకత ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం…బెంగళూరు సిటీకి వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంది.
ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడు దక్షిణదిశగా భక్తులకు దర్శనం ఇవ్వడం వల్ల ఈ ఆలయానికి దక్షిణ ముఖ నందీశ్వరాలయం అనే పేరు వచ్చింది. అదే విధంగా ఈ ఆలయాన్ని నంది తీర్థం అని కూడా పిలుస్తారు.
ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఉంటాయని పురావస్తు శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
తవ్వకాలలో బయటపడిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించి ఉంది.
ఈ ఆలయంలో పరమేశ్వరుడు దక్షణ దిశగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయంలో కోనేరులో ఉన్న శివలింగంపై నిత్యం నీటిధార ఏర్పడి ఉంటుంది. ఆ నీటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందని అధికారులు ఆరాతీయగా నీటి ప్రవాహం నంది నోటిలో నుంచి ప్రవహిస్తుండడం గుర్తించారు.
ఈ విధంగా నంది నోటి నుంచి నిరంతరం శివలింగం పై జల ప్రవాహం కావడం ఈ ఆలయ విశేషం. అయితే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియడం లేదు. ఈ నంది నోటి నుంచి వెలువడే నీటి ప్రవాహాన్ని భక్తులు మహా తీర్థ ప్రసాదంగా భావిస్తారు. ఈ నీటి ప్రవాహాన్ని భక్తులు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి లీలలే అని భావిస్తూ, ఈ ఆలయాన్ని సందర్శించడానికి చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం విశేషమని చెప్పవచ్చు.