పెద్దగా వర్షం పడుతున్నప్పుడు, ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు చిన్నపిల్లల దగ్గరినుండి పెద్దవారి వరకు భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో పెద్దవారు వారు ఉంటే అర్జున… ఫల్గుణ… అనుకోమని చెబుతూ ఉంటారు. దానికి అర్ధం తెలియక పోయినా పెద్దవారు చెప్పారు కాబట్టి పాటిస్తూ ఉంటాం. అయితే అలా అనుకోవడం వెనుక ఉన్న కారణం తెలుసుకుందాం…
పాండవులు విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు కౌరవులతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. జమ్మిచెట్టు మీది బాణాలు తీసేటప్పుడు తాను అర్జునుణ్ననే నమ్మకం ఉత్తర కుమారుడికి కలిగించే ప్రయత్నంలో అతడు పాండవ మధ్యముడి పది పేర్లు చెప్పమంటే అర్జునుడే స్వయంగా తన పది పేర్లు చెప్పుకున్నాడు. అంతేకాదు- ఆ పేర్ల సార్థక్యాన్నీ వివరించాడు.
అర్జున అంటే తెల్లని వర్ణమని అర్థం. అర్జునుడు తెల్లగా ఉంటాడు. అది నిర్మల వర్ణం. మొత్తం భూమిలో తన వర్ణంతో సమానమైన వర్ణం దుర్లభమని, తాను పరిశుద్ధమైన పని చేస్తానని, అందుకే తనను అర్జునుడంటారని భారతంలో అతడు ఉత్తరుడితో చెబుతాడు.
అర్జునుడు ఉత్తర ఫల్గునీ విశేషకాలంలో అంటే పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంధి కాలంలో జన్మించడంవల్ల ఫల్గునుడయ్యాడు.
ఇంద్రుడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చి ఇచ్చిన కిరీటం యుద్ధంలో అతడి శిరస్సు మీద ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది. ఆ కిరీటం అభేద్యం, సుస్థిరం. అందుకే అర్జునుడు కిరీటి.
ఎంతటి బలవంతులు తనను ఎదిరించినా, యుద్ధంలో జయాన్ని సాధించగలడు. అందుకే అందరూ అర్జునుణ్ని విజయుడంటారు.
తాను చూస్తుండగా యుద్ధంలో ఎవరైనా ధర్మరాజు శరీరానికి గాయం కలిగిస్తే వాళ్లను హతమారుస్తాడు గనుక తాను జిష్ణుడనని అర్జునుడు చెప్పాడు.
యుద్ధరంగంలో ఏ చేతితోనైనా అల్లెతాటిని లాగగలడు. కానీ ఆ లాగడంలో ఎడమచేతి వాటం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి సవ్యసాచిగా అర్జునుడు ప్రసిద్ధుడయ్యాడు.
భూమినంతటినీ జయించి పరాజితులైన రాజుల నుంచి అపారమైన ధనం పొందడంవల్ల ధనంజయుడయ్యాడు.