Home Unknown facts బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ పసిపిల్లలుగా మార్చిన తీరు

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ పసిపిల్లలుగా మార్చిన తీరు

0

చరిత్రలో ఎంతో మంది స్త్రీ మూర్తులను గౌరవించిన సాంప్రదాయం మనది.. కానీ వారి పాతివ్రత్యం మూలంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు కొందరు. అందులో ఒకరు అనసూయ ఈ కథ తెలుసుకుంటే ఆమె ఎందుకు అంత గొప్పది అంటారో మనకు అర్ధం అవుతుంది .

Trimurtuluత్రిమూర్తుల భార్యలు ఎవరికివారు తమని మించిన పతివ్రతలేదని గర్వితులయ్యారని గ్రహించిన నారద మహర్షి, వారికి కనువిప్పు కలిగించాలనుకున్నాడు. ఒకనాడు త్రిమూర్తుల భార్యల వద్దకు ఇనుప గింజలను పట్టుకుని ఒక్కొక్కరి వద్దకు విడివిడిగా వెళ్లి గింజలను వేయించియిస్తే తిని క్షుద్బాధని తీర్చుకుంటానని కోరతాడు. అవి ఇనుప గింజలు కనుక ముగ్గురూ నిస్సహాయిలై వాటిని ఎవరూ వండలేరని అంటారు.అప్పుడు నారద మహర్షి పతివ్రతలకు సాధ్యంకానిదంటూ ఏమీ ఉండదు.

కనుక నేను ముల్లోకాల్లోనూ మహాపతివ్రత అని కీర్తించబడుతున్న అనసూయాను మాతనే ఆశ్రయిస్తానని చెప్పి అత్రి మహర్షుల వారి ఆశ్రమానికి వెళ్తాడు. అవే ఇనుప గింజలను అనసూయా మాతకిచ్చి వాటిని వేయించి పెడితే ఆకలి బాధ తీర్చుకుంటానని చెప్తాడు. అనసూయా మాత మనసులో తన భర్తని స్మరించి వాటిని వేయించి ఇస్తుంది. నారద మహర్షి తృప్తిగా ఆరగించి, జరిగిన విషయాన్ని ముగ్గురమ్మలకూ చెప్తాడు. ఈ విషయాన్ని నమ్మలేని అమ్మలు ముగ్గురూ త్రిమూర్తులని అనసూయా మాత పాతివ్రత్యాన్ని పరీక్షించవలసిందిగా కోరతారు.

తమ భార్యల కోరిక తీర్చదలచిన త్రిమూర్తులు, అత్రి మహర్షి అనుష్టానానికి వెళ్లిన సమయం చూసి మారువేషంలో ఆశ్రమానికి వస్తారు. అతిధులను ఆహ్వానించిన పిదప “మహర్షులవారు అనుష్టానానికి వెళ్లారు కనుక మీకు ఏ విధంగా సేవ చేయగలనని” అనసూయా మాత అడుగుతుంది. తమకు ఆకలిగా ఉందని త్వరితగతిన తమకు భోజనం పెట్టమని అడిగి, వివస్త్రయై భోజనం వడ్డిస్తేనే తాము ఆహారం స్వీకరిస్తామనే షరతు విధిస్తారు. భోజన సమయంలో వచ్చిన అతిధిని ఆకలితో తిప్పి పంపితే, గృహస్తు పుణ్యమూ, తపస్సు వచ్చిన అతిధుల వెంట వెళ్తాయని శాస్త్ర వచనం.

పరపురుషుని ఎదుట నగ్నంగా నిలిచినట్లయితే పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది. ఇలా అనసూయామాత పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుకుంటుంది . అత్రి మహర్షుల వారి సాంగత్యం వల్ల తాను పవిత్రురాలినైనందుకు భయపడవలసిన పనిలేదని అనుకోని అయ్యలారా మీరు ఆసీనులుకండని చెప్పి ఆహారపదార్ధాలు తీసుకురావడానికి వెళ్లింది. పతియే దైవమని తలచే నాకు, పాతివ్రత్యం గురించి భయపడనవసరంలేదని వివస్త్రయై వడ్డించడానికి అతిధుల ముందుకు వచ్చింది.

ఆమె పాతివ్రత్య మహిమవల్ల త్రిమూర్తులు ముగ్గురూ పసిపాపలైపోయారు. ఆ పసిపాపలను చూడగానే అనసూయామాతకు మాతృభావం వల్ల స్తన్యం వచ్చింది. వారికి పాలిచ్చి నిద్రపుచ్చుతు ఉండగా అత్రి మహర్షులవారు వస్తారు. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్న మహర్షుల వారు స్తోత్రం చేస్తారు. స్తోత్రానికి మెచ్చి త్రిమూర్తులు నిజరూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమంటారు. సంతానాపేక్షతో వున్న మాకు మీరే పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించమని కోరుకొంటారు, తధాస్తు అని దీవించి త్రిమూర్తులు అంతర్ధానమవుతారు.

పతిలోని దైవాన్ని నమ్మి సాధన చేస్తున్న సాధకురాలికి గర్వం పనికిరాదు, గర్వం ఙ్ఞానసముపార్జనకి పెద్ద అడ్డంకి. సాధకురాలికి ఙ్ఞానం సిద్ధించిన తర్వాత ఆమెకు సాధ్యం కానిదంటూ ఉండదు. ఙ్ఞానాన్ని పొందినవారంటే భగవంతుని తత్త్వాన్ని తెలుసుకుని వారిలో ఐక్యమైనవారని అర్ధం. భగవంతునితో ఐక్యమైనవారికి సాధ్యం కానిది ఏమిఉండదు.

 

Exit mobile version