Home Unknown facts మన దేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి?

మన దేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి?

0

మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. పురాతనకాలం నుండి ఉన్న అతి ప్రాచీన దేవాలయాలు అనేవి ఇప్పటికి మనకి దర్శనం ఇస్తుంటాయి. ఆ కాలంలో వారి నిర్మాణ శైలి, శిల్పకళానైపుణ్యం ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్దుల్ని చేస్తుంటాయి. ఇది ఇలా ఉంటె ఆశ్చర్యానికి గురి చేసే ఈ అతిపెద్ద ఆలయాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మరి మన దేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ రంగనాథస్వామి ఆలయం – శ్రీరంగం

Largest Hindu Temples

తమిళనాడు రాష్ట్రం, తిరుచిరావల్లి జిల్లాలో ఉభయ కావేరి నదుల మధ్య శ్రీ రంగనాథస్వామి ఆలయం ఉంది. 108 దివ్యతిరుపతులలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. హిందూ దేవాలయాలలో అన్నిటికంటే ఈ ఆలయం పెద్దదిగా చెబుతారు. ఈ ఆలయ విస్తీర్ణం 156 ఎకరాలు. ఈ శ్రీరంగ ఆలయం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో ఉంటుంది. ఈ గోపురాన్ని రాజగోపురం అని అంటారు. దీని ఎత్తు 236 అడుగులు. ఇది ఆసియాలోనే అతి పెద్ద గోపురం అని చెబుతారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, రంగనాథ ఆలయ శిఖరం ఓం ఆకారంలో ఉంటుంది. ఈ క్షేత్రానికి మూడు విశేషాలు ఉన్నాయి. ఒకటి స్తల విశేషం, రెండు మూర్తి విశేషం, మూడు తీర్థ విశేషం.

అక్షరధామ్ ఆలయం – ఢిల్లీ

న్యూ ఢిల్లీ లో దాదాపుగా వంద ఎకరాల స్తలంలో నిర్మించబడి అతి పెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి అక్షరధామ్ ఆలయం. ఈ ఆలయం యమునా తీరంలో ఉంది. ఇక్కడి కట్టడాన్ని 148 రాతి ఏనుగులు తమ భుజాలపై మోస్తున్నట్లు తీర్చిదిద్దబడింది. ఈ 148 ఏనుగులు, భారత పురాణాలకు, పంచతంత్రానికి చెందిన గాథల ప్రతిరూపాలు, కాంగ్రా చిత్తూరువులు, సుమారు 20 వేల దేవతామూర్తుల విగ్రహాలు, పురాణ, ఇతిహాసాల కథలు, గాథలతో ఈ భవనంలోని ప్రతి చదరపు అంగుళం, కళత్మకంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడి గర్భగుడిలో 11 అడుగుల ఎత్తులో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం మనకు దర్శనమిస్తుంది.

బృహదీశ్వరాలయం – తంజావూరు

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఈ బృహదీశ్వరాలయం ఉంది. ఇది అతి ప్రాచీన పురాతన శివాలయం. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింబడినది. మన దేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. అయితే 13 అంతస్తులు ఉన్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తు ఉంది. పైన 80 టన్నుల బరువు ఉన్న నల్లరాతితో శిఖరాగ్రాన్ని నిర్మించారు. గర్భగుడిలో ఉన్న శివలింగం పూర్తిగా నల్లరాయితో చేయబడి పదహారడుగుల ఎత్తు 21 అడుగుల కైవారం కలిగి ఉంటుంది. ఇక అతిపెద్ద నంది విగ్రహం లేపాక్షి లో ఉండగా, రెండవ అతిపెద్ద నంది విగ్రహం ఈ ఆలయం లో ఉంది.

అరుణాచల దేవాలయం – తమిళనాడు

తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా, అన్నామలై కొండ దిగువన అన్నామలైయార్ ఆలయం ఉంది. తమిళనాడులోని ఆలయాలలో ఉన్న శివాలయాలలో ఇది ఒక గొప్ప శైవ క్షేత్రం. ఇక్కడి స్వామివారు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అరుణాచలేశ్వరి. శివుడి పంచభూత క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం అగ్నిని సూచిస్తుంది. ఇక్కడి లింగాన్ని తేజోలింగం అని అంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణం చాలా ముఖ్యమైనది. దాదాపుగా 12 కి.మీ. చుట్టుకొలత ఉన్న ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ లో మొత్తం 8 శివాలయాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో పౌర్ణమి నాడు దీపోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ 1000 కిలోల నెయ్యి వేసి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఈ మహాదీపం 11 రోజుల పాటు దేదీప్యమానంగా వెలుగుతుంది.

శ్రీ నటరాజస్వామి ఆలయం – చిదంబరం

తమిళనాడు రాష్ట్రం, కడలూరు జిల్లా, చిదంబరంలో నటరాజస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ చిదంబర ఆలయంలో శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలిసాడు. ఇక్కడ పంచభూతాలకు ఒక్కో ఆలయం నిర్మించబడింది. ఇక అందరు చిదంబర రహస్యం అని అంటారు, చిదంబర రహస్యం అంటే ఈ ఆలయంలో శివుడు నటరాజ రూపం, చంద్రమౌళీశ్వర స్పటిక లింగ రూపం, రూపం లేని దైవసాన్నిధ్యం అనే 3 రూపాలలో స్వామి దర్శనమిస్తాడు. ఆ మూడో రూపమే చిదంబర రహస్యం. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీస్థలం ఉంటుంది. మనకి కనిపించని ఆ కాళీస్థలాన్ని చిదంబర రహస్యం అని అంటారు.

మధుర మీనాక్షి అమ్మవారు – మధురై

తమిళనాడు రాష్ట్రంలోని మధురై లో శ్రీ మధుర మీనాక్షి దేవాలయం ఉంది. భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం 283 గజాల పొడవు, 243 గజాల వెడల్పుతో ఒక పెద్ద కోట లాంటి ఆవరణలో ఉంది. ఈ ఆలయ గోపురం 160 అడుగుల ఎత్తులో ఉంటుంది. తమిళ పురాణాల ప్రకారం శివుడికి, మీనాక్షి దేవికి వివాహం ఇక్కడే జరిగిందని చెబుతారు. ఆ ఆలయంలో ఉన్నంత శిల్ప కళ నైపుణ్యం మరెక్కడా కూడా లేదనే చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో ఎక్కువమంది దర్శించే ఆలయాల్లో మీనాక్షి దేవి ఆలయం ఒకటి. ఇక ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నాలుగు దిక్కుల నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంబీరంగా కనబడుతుంది.

Exit mobile version