కరోనా మహమ్మారి భయంతో ఇప్పటికే ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. దాని నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడడానికి వాక్సిన్లు, శానిటైజర్లు, మాస్క్లు అంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కొంత వరకు దాని భయం దగ్గుతుంది అనుకునేలోపే కొత్తగా వైరస్లు పుట్టుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బయటపడింది.
ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఎబోలా జాతికి చెందిన వైరస్ కావడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన చెందుతోంది. గత రెండు నెలలుగా గినియా దేశంలో ఎబోలా నుంచి ముప్పు తప్పిందని అనుకున్న తరుణంలో ఎబోలా జాతికి చెందిన మార్బర్గ్ వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అయ్యాయి.
పళ్లుతినే గబ్బిలాల నుంచి ఈ వైరస్ సోకుతున్నట్టు అధికారులు గుర్తించారు. మార్బర్గ్ వైరస్ సాధారణంగా గబ్బిలాల నుంచి వ్యాపిస్తుంది. ఆ తర్వాత కోవిడ్-19 మాదిరిగానే అత్యంత వేగంగా.. ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని.. వైరస్ ప్రభావం ఎక్కువ కనిపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ సోకితే 24 నుంచి 88 శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు ఈ వైరస్ సోకితే అందించాల్సిన చికిత్సగాని, వ్యాక్సిన్ గాని లేదని, అందుబాటులో ఉన్న ప్రత్యామ్మాయాలతోనే చికిత్స చేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. గతేడాది ఎబోలా వైరస్ సోకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వైరస్ను అరికట్టిన కొద్ది నెలల్లోనే మార్బర్గ్ వైరస్ బయటపడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్.. లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అసౌకర్యంతో అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి జ్వరంతో పాటుగా రక్తనాళాలు చిట్లిపోతాయి. దీంతో మరణం సంభవిస్తుంది. రోగితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వారికి, రోగి స్రావాలను, రోగి తాకిన ఉపరితలాలను, వస్తువులను తాకడం ద్వారా ఇది వ్యాపిస్తుంది.
ఈ వైరస్ సోకిన తర్వాత బాధితుడిపై 7 రోజులపాటు తీవ్ర ప్రభావం ఉంటుందట. కరోనాతో 1 నుంచి 5 శాతం లోపు మరణాలు సంభవిస్తే దీని వల్ల అత్యధిక మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లోనే వైరస్ ని అరికట్టగలిగితే ప్రమాదాన్ని, ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.
కరోనా మాదిరిగానే ఈ వైరస్ కూడా మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, దానికి వాక్సిన్ కూడా లేదు కాబట్టి మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు నిపుణులు.