శ్రీరాముడు లేకుండా సీతాదేవి మాత్రమే దర్శనమిచ్చే ఏకైక ఆలయం

సీతను రాముడు అడవులకు పంపడం, అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఆమె లవకుశులకు జన్మనివ్వడం, తర్వాత అశ్వమేధయాగ సమయంలో రామలక్ష్మణులతో లవకుశులు యుద్ధంచేయడం రామాయణంలో మనకు బాగా తెలిసిన ఘట్టాలే. మరి సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశంలో ఉన్న ఆనవాళ్లు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sita Devi Appears Without Lord Rama

కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, ముల్‌బాగల్‌ తాలూకాలోని ఆవని అనే పుణ్యక్షేత్రం ఉంది. అయితే శ్రీరాముడు లేకుండా సీతాదేవి మాత్రమే దర్శనం ఇచ్చే ఆలయం ఇది ఒక్కటే అని చెబుతారు. ఇక్కడ రామలక్ష్మణులూ, భరతశత్రుఘ్నులతో పాటు సుగ్రీవాది వానరులూ తమ తమ పేర్లతో శివలింగాలను ప్రతిష్ఠించారు. వాల్మీకి తపస్సు చేసిన గుహనీ ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా ఆవనిలోని ప్రతి అణువూ పరమ పవిత్రమే.

Sita Devi Appears Without Lord Rama

గర్భవతైన సీతమ్మను రాముడి ఆజ్ఞ మేరకు అడవుల్లో వదులుతాడు లక్ష్మణుడు. తర్వాత ఆమె వాల్మీకి ముని ఆశ్రమానికి చేరుతుంది. సీతమ్మను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు వాల్మీకి మహర్షి. ఆశ్రమంలోనే లవకుశులకు జన్మనిస్తుంది సీత. లవకుశులు అక్కడే పెరుగుతూ సకల విద్యలనూ అభ్యసిస్తారు. అప్పుడు ఆశ్రమం దగ్గరలోనే ఓ చోట సీతమ్మ పార్వతీదేవిని పూజించేదట. తర్వాత రాముడు అశ్వమేధయాగం చేస్తాడు. అప్పుడు వదిలిన గుర్రాన్ని లవకుశులు కట్టేయడంతో రాముడూ ఆయన సోదరులకీ, లవకుశులకూ మధ్య యుద్ధం జరుగుతుంది. తర్వాత విషయం తెలుసుకున్న రామభద్రుడు కన్నబిడ్డల మీద యుద్ధానికి దిగినందుకు ఎంతో వ్యధ చెందుతాడు. ఈ పాపానికి పరిహారంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సహా వానరులూ రామ పరివారమంతా అక్కడే శివలింగాలను ప్రతిష్ఠించి ప్రార్థిస్తారు.

Sita Devi Appears Without Lord Rama

ఉత్తర రామాయణంలోని ఈ ఘట్టం జరిగిన చోటు ఇదేనని ఆవని స్థలపురాణంలో తెలుస్తోంది. అప్పుడు రాముడు ప్రతిష్ఠించిన లింగమే రామలింగేశ్వర స్వామిగా ఆవనిలో పూజలందుకుంటోంది. అంతేకాదు లక్ష్మణేశ్వర లింగమూ, భరత శత్రుఘ్నులు ప్రతిష్ఠించిన లింగాలనూ మనం ఇప్పటికీ దర్శించొచ్చు. నిజానికి ఆవనిలో మొత్తం 1100 దాకా శివలింగాలుండేవట. తురుష్కుల దండయాత్ర కారణంగా ఇప్పుడు వీటిలో కొన్నే మిగిలి ఉన్నాయి. ఆవనిలోని శివలింగాలకు చోళరాజులు గుళ్లు కట్టించారు. పల్లవులూ, విజయనగర రాజులూ వీటిని అభివృద్ధి చేశారు.

Sita Devi Appears Without Lord Rama

సీతాదేవి పూజించినట్టుగా చెబుతున్న పార్వతీదేవి స్వయంభూ విగ్రహాన్ని ఇప్పుడు కూడా ఆవని కొండమీద ఉన్న సీతా పార్వతి ఆలయంలో చూడొచ్చు. తొలుత ఈ గుళ్లొ పార్వతీ దేవి మాత్రమే ఉండేదట. ఒకసారి ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు ఆయనకు ఆదిశక్తి కలలో కనిపించి తన విగ్రహం పక్కనే సీతాదేవి విగ్రహాన్నీ ప్రతిష్ఠించమని చెప్పిందట. శంకరులు దాన్ని శిరసావహించారు. ఇక ఇక్కడి కొండ మీద వాల్మీకి తపస్సు చేసుకున్న గుహగా పిలిచే ఓ గుహను మనం చూడొచ్చు. లవకుశుల జన్మప్రదేశం, పవళించిన తొట్టె, ఉగ్గుగిన్నె, పసుపు కుంకుమ గిన్నెలు, నీళ్లు కాచే కాగు తదితరాల శిలామయ చిహ్నాలు ఇక్కడ కనిపిస్తాయి. సీతాదేవి బట్టలుతికిన బావి, స్నానం చేసిన కొలను, రామచంద్రుడితో లవకుశులు యుద్ధం చేస్తున్నారని తెలిసి ఆమె దుఃఖించిన చోటు తదితరాలుగా చెప్పే కొన్ని ప్రదేశాలూ దర్శనమిస్తాయి. కొండమీద లవకుశులు, బృహస్పతి, జాంబవంతుడు, ఆంజనేయుడు ప్రతిష్ఠించిన లింగాలకు చిన్న గుళ్లున్నాయి.

ఇలా వెలసిన ఈ పుణ్యక్షేత్రానికి ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR