రెండు తెలుగు రాష్ట్రాలలో శ్రీశైల క్షేత్రం గురించి అందరికి తెలుసు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అమ్మవారి శక్తీ పీఠాలలో ఒకటిగా శ్రీశైల మహా క్షేత్రం విరాజిల్లుతూ ఉంది.
జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లిఖార్జున లింగము, అమ్మవారి కంఠం( గ్రీవం ) పడిన స్థానం కనుక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికా శక్తి పీఠము శ్రీశైలంలో ఒకే ఆవరణలో వెలిశాయి. శ్రీశైల స్థల పురాణం మేరకు శ్రీమల్లి కార్జున స్వామి ఆలయం 10వ శతాబ్దానిదని, భ్రమరాంబాలయం 16వ శతాబ్దానిదని ఆధునిక చరిత్రకారులు చెప్తున్నప్పటికీ ఇది చాలా ప్రాచీన మైనది.
శ్రీశైల స్థల పురాణమంత స్కాందపురాణములోని “శ్రీశైల ఖండం” అనుపేర గలదు. ఈ ప్రాంతంలో శిలాదుడనే మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకోమని అడిగాడు. అప్పుడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత పుత్రున్ని పొందేలా వరం ప్రాసాదించు అని కోరుకున్నాడు.ఆ వర ప్రభావంచేత శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు.
వీరిలో పర్వతుడు స్వామి వారి గురించి మళ్ళీ తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయ్యి నీకు సాయుజ్య ముక్తి నిస్తున్నాను అని వరమివ్వగా, పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా! “నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువుండేలా, నాలోపల ముక్కోటి దేవతలు, సర్వ తీర్థాలు, సమస్త ఓషధాలు నివసించేలా” వరం ప్రసాదించు అని అడిగాడు.
అదివిని శంకరుడు ఎందుకు అలాంటి వరం కోరుకొంటున్నావు అనగా నేనొక్కడిని తరించడంకాదు, ఇక్కడికి వచ్చిన ప్రతిభక్తుడూ తరించేందుకు అనువుగా ఈవరాన్ని కోరుతున్నాను. ఈ తీర్థాలలో స్నానం చేసిన వారికి సమస్త పాపాలు నశించాలి, ఇక్కడ లభించే ఓషదాలతో ఎటువంటి రోగమైనా నశించాలి.
శ్రమపడి వచ్చిన వారందరూ నీ దర్శనాన్ని, అనుగ్రహాన్ని పొందాలి. అందుకనే ఈవరంకోరుతున్నాను అని పర్వతుడు చెప్పాడు. బోళా శంకరుడు సంతోషించి వరం ప్రసాదించాడు. శివుడు లింగరూపంలో అక్కడ అవతరించాడు. ఇక్కడ పరమేశ్వరుడు మల్లిఖార్జునిగా,పార్వతీ దేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిసారు.