శ్రీ మహావిష్ణువు లోకకల్యాణం కోసం మొత్తం పది అవతారాలు ఎత్తాడు. వాటినే దశావతారాలు అని పిలుస్తుంటాం. అయితే శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్కో అవతారానికి డార్విన్ సిద్ధాంతానికి పోలిక ఉందని చెబుతుంటారు. మరి అసలు డార్విన్ సిద్ధాంతం అంటే ఏంటి? డార్విన్ సిద్ధాంతానికి దశావతారలకి పోలిక ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇంగ్లాండ్ కి చెందిన ఒక ప్రకృతి వాది. అయన జీవ పరిణామ సిద్ధాంతాన్ని వర్ణించాడు. అయితే అయన చెప్పిన డార్విన్ సిద్ధాంతం ప్రకారం సృష్టిలో దేవుడు అనేవాడు లేడు, ప్రకృతి వైవిధ్యాలను కలిగించదు. ఉపయోగకరమైన వైవిధ్యాలతో ఉన్న జీవులను మాత్రం ప్రకృతి ఎన్నుకుంటుంది. దీనినే నేచురల్ సెలక్షన్ అని అంటారు. అంతేకాకుండా మానవ జీవితం తొలిసారి నీటి నుంచి ఉద్భవించిందని డార్విన్ సిద్ధాంతం పేర్కొంటోంది. తర్వాత ఉభయచరాలు భూమి, నీటిలో మనుగడ సాగించాయి. ఆ తర్వాత ఇవి సరీసృపాలుగా రూపాంతరం చెందాయి. మెల్లగా కోతులు రెండు అడుగులు పైకిలేచి నాలుగు కాళ్లతో నడిచేవి. ఇలా క్రమంగా మానజాతి అభివృద్ధి చెందింది. మానవ పరిణామ క్రమంలో ముందు పొట్టిగా ఉండేవారు, క్రమంగా పొడుగ్గా మారారు అని ఆయన చెప్పారు.
ఇది ఇలా ఉంటె శ్రీమహావిష్ణువు దశావతారాలతో డార్విన్ సిద్ధాంతాన్ని పోల్చి చూస్తే:
- మత్స్యావతారం:
దశావతారాల్లో మొదటి మత్స్యావతారం. సత్య యుగంలో శ్రీహరి చేపగా అవతరించి వేదాలను రక్షించాడు. అలాగే డార్విన్ ప్రకారం మానవ జీవితం కూడా మొదటి నీటిలో ప్రారంభమై తర్వాత భూమిపైకి వచ్చింది
- కూర్మావతారం:
రెండోదైన కూర్మావతారం కూడా సత్య యుగంలోదే. ఈ యుగంలో శ్రీమహా విష్ణువు తాబేలు అవతారం దాల్చి పాలసముద్ర మథనంలో సాయపడ్డాడు. అంటే తాబేలు ఉభయచరం. ఇది నీటితోపాటు భూమిపై కూడా జీవించగలదు. ఇది డార్విన్ సిద్ధాంతంలోని ఉభయచరాలు.
- వరాహ అవతారం:
మూడోది వరాహ అవతారం. పంది రూపంలో నాలుగు కాళ్లతో భూమిపై సంచరించి, హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించాడు. భూమిపై నాలుగు కాళ్ల జంతువు సంచారానికి ఇది సంకేతం.
- నరసింహ అవతారం:
నాలుగోది నరసింహ అవతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి సగం జంతువు, సగం మనిషి. ఇధియే జంతువు నుంచి మనిషిగా రూపాంతరం చెందడం.
- వామనావతారం:
అయిదోది వామనావతారం. విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించడం ఇదే తొలిసారి. త్రేతాయుగంలో వామనుడిగా అవతరించి బలి చక్రవర్తిని అంతం చేశాడు. అంటే వామనుడు కూడా రూపంలో చాలా పొట్టిగా ఉండేవాడు. డార్విన్ కూడా మానవుడు మొదట పొట్టిగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
- పరశురాముడు:
ఆరో అవతారం పరశురాముడు. పూర్తిగా మానవుడే గానీ, జంతు స్వభావం, అడవిలో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడిపాడు. ఇది జీవ పరిణామ సిద్ధాంతంలోని జంతువు నుంచి రూపాంతరం చెందిన మానవ దశ. డార్విన్ ప్రకారం మానవుడు కూడా ఒంటరిగానే అడవుల్లో సంచరించాడు.
- రామావతారం:
ఏడోది రామావతారం. ఈ అవతారంలో రాముడికి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అంటే ఓ కుటుంబం ఉంది. ఇతరులపై దయ చూపేవాడు. ఆయోధ్యకు రాజుగా సుపరిపాలన అందించాడు. న్యాయం విషయంలో తరతమ భేదాలను పాటించలేదు.
- కృష్ణావతారం:
ఎనిమిదోది కృష్ణావతారం. ద్వాపర యుగంలో కృష్ణుడు తెలివిగా వ్యవహరించాడు. యుద్ధ వ్యూహాల అమలు చేసేటప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఆచరించాడు. దౌత్యవేత్తగానూ అదర్శంగా నిలిచాడు. అంటే ఇది మానవుల మానసిక పరిణామానికి నిదర్శనం.
- బుద్ధావతారం:
బుద్ధుడు విష్ణుమూర్తి తొమ్మిదో అవతారంగా చెబుతారు. త్రిపాసురుల సంహారం కోసం ఈ అవతారాన్ని ఎత్తుతాడు. ఇక ధ్యానం చేస్తే మోక్షం లభిస్తుందని హింసను వీడితే ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుందని ప్రచారం చేశాడు. ఇక డార్విన్ సిద్ధాంతంలో మనుషులు ఈ దశలో జ్ఞానం పొందుతారని సూచించాడు.
- కల్కి అవతారం:
కలియుగంలో భగవానుడు కల్కిరూపం ధరిస్తాడని గీతలో పేర్కొన్నారు. ప్రపంచంలో ధర్మం నశించినప్పుడు కల్కి రూపంలో అవతరిస్తాడు. ఇక కలియుగం అంతమయ్యేనాటికి మానవుల సగటు ఆయుష్షు పన్నెండేళ్లకు పడిపోగా, ఎత్తు కూడా రెండు అడుగులే ఉంటుందని భగవద్గీతలోని ఒక శ్లోకంలో పేర్కొన్నారు.
ఇలా డార్విన్ సిద్ధాంతం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలని పోలి ఉంది అతను చెప్పిందే నిజం అని కొందరు అంటే, మరికొందరు దానిలో ఎలాంటి నిజం లేదని వ్యతిరేకించేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికి డార్విన్ సిద్ధాంతం పైన భిన్న వాదనలు అనేవి ఉన్నాయి.