”జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్యచ” పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు గిట్టక తప్పదు. మరణించిన వాడు మళ్ళీ పుట్టుక మానడు. మరణం తర్వాత జీవిలో ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్తుంది. జననం-మరణం అనేది ఆత్మలు తిరుగుతున్న చక్రం లాంటివి. ఈ సత్యాన్ని తిరస్కరించలేం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణం రెండు రకాలుగా ఉంటుంది. సహజమైన మరణం, అసహజమైన మరణాలు. సహజ మరణం అనారోగ్యం వల్ల, శరీరం వృద్ధాప్యంతో అలసిపోయి ఆత్మ బయటకు వెళ్లడంతో సంభవిస్తుంది. అసహజ మరణం అంటే ప్రమాదావశాత్తు సంభవించే ఘటనలు. పాము కాటు, ఆయుధాలు, ఆత్మహత్య ఇలా రకరకాల ప్రమాదాల ద్వారా వచ్చే మరణాలు.
పురాణాల ప్రకారం సహజ మరణానికి ముందు జీవుల శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయని తెలుస్తోంది. మరణానికి ముందు వారి దేహం తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతుంది. కళ్లు కూడా ఎర్రబడి ఉంటాయి. ఈ విధంగా రంగు మారడాన్ని బట్టి ఆ వ్యక్తి మరణానికి దగ్గరలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.
మనుషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ కూడా పుడుతుంది. మరణించేటప్పుడు ఆ ఛాయ కూడా వెళ్లిపోతుంది. మనిషి తన ప్రతి బింభాన్ని నీరు లేదా నెయ్యి, అద్దం, నూనేలో చూడలేనప్పుడు అది మరణానికి సంకేతంగా చెబుతారు. అంటే మనిషి పుట్టినప్పుడు వచ్చే నీడ.. వారు మరణించే సమయంలో ఆత్మ రూపంలో బయటకు వెళ్తుంది.
ఇక మరణం అతి సమీపంలో ఉన్న జీవిలో నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. ఏదో ఇరుకుగా ఉన్న చోట బలవంతంగా బంధించిన భావన కలుగుతుంది. నోటి తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తుంది. శరీరం సగ భాగం వరకు చిట్లిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇదే సమయంలో ఆత్మ నాభి చక్రం గుండా బద్దలు కొట్టుకుంటూ శరీరాన్ని త్యజిస్తుంది. ఫలితంగా కళ్లు, నోరు, చెవులలో శక్తి నశించి పోతుంది. ఇలా శరీరాన్ని వదిలేసిన ఆత్మ పరమాత్ముడిలో ఐక్యం అవుతుంది. ఇది విముక్తికి మార్గాన్ని సులభతరం చేస్తుంది.
అయితే ప్రమాదాల వల్ల అకాల మరణం పొందిన మనిషి ఆత్మ చంచలమైనంది. ఎందుకంటే వీరికి భౌతిక కోరికలు పూర్తిగా నశించవు. అలాంటి పరిస్థితుల్లో వారి ఆత్మ భూలోకానికి, పరలోకానికి మధ్య కొట్టుమిట్టాడుతుంది. అందుకే పితృ పక్షంలో వీరి పేరిట పిండ ప్రధానం చేస్తే వారి ఆత్మకు సంతృప్తి, శాంతి చేకూరుతుంది