Written By Sai Vamshi
వినిపించే కళకు.. ఆకారం వీరు ✍️❤️
సినిమా అంటే 24 అంశాల సంగమం. అందులో డబ్బింగ్ గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. డబ్బింగ్ అంటే ఏమిటి? ఎందుకు? అనే వివరాలు వాళ్లు వీళ్లు చెప్తే విని తెలుసుకోవడం తప్ప.. ఇంతవరకూ ఎప్పుడూ డబ్బింగ్ థియేటర్ కూడా చూడలేదు. డబ్బింగ్ గురించి ఆసక్తి మొదలవడానికి కారణం ‘అంతఃపురం’.
2004లో టీవీలో ‘అంతఃపురం’ సినిమా వస్తున్నప్పుడు ‘సౌందర్య అసలు వాయిస్ ఇలా ఉండదే’ అనుకున్నా. ‘9 నెలలు’, ‘ఆజాద్’ సినిమాల్లో మరోలా ఉందనిపించింది. ఆ తర్వాత తెలిసిన సంగతేంటంటే.. ఆ సినిమాల్లో ఉన్నది సౌందర్య అసలు గొంతు అని. ‘అంతఃపురం’లో ఆమెకు గాత్రదానం చేసింది నటి సరిత. అప్పటి నుంచి డబ్బింగ్ గురించి తెలుసుకోవడం ఆసక్తిగా మారింది.
నటన అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. గొంతు కూడా. అయితే భాష రాని కారణం వల్ల, భాష వచ్చినా గొంతు బాగుండక, మరికొన్ని సార్లు బిజీ వల్ల.. నటీనటులు గాత్రధారులపై ఆధారపడతారు. ఇది చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. డబ్బింగ్ చిత్రాలు వీటికి అదనం. డబ్బింగ్ రచయితలది రాసే పనైతే.. ప్రత్యేకంగా డబ్బింగ్ చిత్రాల కోసం కొందరు డబ్బింగ్ ఆర్టిస్టులు ఇప్పటికీ మద్రాసులో ఉన్నారు.(మిమిక్రీ నాగేశ్వరరావు గారు అందులో ముఖ్యులు).
తెలుగులో నటులుగా పేరు పొందిన రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, శివాజీ.. తొలినాళ్లలో డబ్బింగ్ కళాకారులుగా పనిచేశారన్నది తెలిసిందే(‘దిల్’ చిత్రంలో నితిన్కి చెప్పిన డబ్బింగ్కు గానూ శివాజీ గారికి నంది అవార్డు కూడా వచ్చింది). అయితే గాత్రదానంలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది నటీమణుల గురించి. రోజా రమణి, సరిత, రోహిణి.. 1980 నుంచి 2000 సంవత్సరం వరకు తెలుగులో అధిక కథానాయికలకు డబ్బింగ్ వీళ్లే చెప్పడం విశేషం. టీవీ సీరియల్ నటిగా ఉన్న శిల్ప కూడా వీరితో పాటు కొనసాగారు.
1997 నుంచే మొదలైన రవిశంకర్, గాయని సునీత 2000 సంవత్సరం తర్వాత బాగా ఎక్కువగా వినిపించారు. 1999లో ‘జీన్స్’ చిత్రం నుంచి మొదలైన సవితారెడ్డి సునీత తర్వాతి స్థానాన్ని పొందారు. 2002 నుంచి 2010 దాకా దాదాపు తెలుగులో వచ్చిన అధిక చిత్రాల్లో సునీత లేదా సవితారెడ్డి గొంతే వింటాం. ఆ మధ్య కాలంలో నంది అవార్డులు కూడా వీళ్లకే ఎక్కువగా రావడం విశేషం. భూమిక, సిమ్రాన్, ఆర్తి అగర్వాల్, త్రిష, జెనీలియా అనగానే సవితారెడ్డి.. సదా, స్నేహ, ఛార్మి, కమలినీ ముఖర్జీ అనగానే సునీత గుర్తుకు వచ్చేంతగా వాళ్ల గాత్రం ఆయా నటులకు సరిగ్గా సరిపోయింది. ఆ టైంలోనే అనుష్కకు సూటయ్యే కంఠంతో సౌమ్య డబ్బింగ్లో రంగప్రవేశం చేశారు.
మరో పక్క ఘంటసాల రత్నకుమార్, వాయుపుత్ర నాగార్జున, శ్రీనివాసరాజు, ఆర్.సి.ఎం.రాజు లాంటివారు హీరోలు, ప్రతినాయకులు, క్యారెక్టర్ యాక్టర్ల పాత్రలకు తమ గొంతుతో జీవం పోశారు. 2010లో ‘ఏ మాయ చేశావే’ సినిమాతో జనాల దృష్టి డబ్బింగ్ మీదకు వెళ్లి దాని ప్రాధాన్యం గుర్తించడం మొదలైంది. గాయని చిన్మయికి ఆ విషయంలో క్రెడిట్ ఇవ్వాలి.
ఇంకా చాలా మంది పేర్లు ఇందులో పొందుపరచాలి. దుర్గ, చంద్రిక, హరిత, జ్యోతివర్మ, ఉమామహేశ్వరి, జితేంద్ర, మైత్రేయి, ప్రియాంక, కిరణ్, శ్రీవల్లి, మురళి, అజీజ్ నాసిర్.. ఇంకా ఎందరో! వాళ్లు మనకు కనిపించరు. వినిపిస్తారు. ఇందులో నేను కొందరి గొంతు విని అది ఎవరని చెప్పగలుగుతాను. ఆ కళ మీద గౌరవం.. ఆ కళాకారుల మీద గౌరవం వల్లే అది సాధ్యం.
డబ్బింగ్ కళాకారులు.. కొన్ని ప్రముఖ సినిమాలు
రోజా రమణి – మౌనపోరాటం, నిరీక్షణ, ఆమె, సీతారామయ్య గారి మనవరాలు
సరిత – అమ్మోరు, పవిత్రబంధం, సఖి, అత్తారింటికి దారేది(నదియా), నరసింహ(రమ్య కృష్ణ)
రోహిణి – శివ, ఏప్రిల్ ఒకటి విడుదల, సొగసు చూడతరమా, అర్జున్ (కీర్తిరెడ్డి)
సునీత – చూడాలని ఉంది, ఆనంద్, జయం
సవితా రెడ్డి – కలిసుందాం రా, బొమ్మరిల్లు, మిస్సమ్మ, నువ్వు నాకు నచ్చావ్, ఢీ, అతడు
శిల్ప – మిస్టర్ పెళ్లాం, అరుంధతి, రాజన్న (శ్వేతామీనన్)