ఎండాకాలంలో చెమట పట్టడం సహజమే. కొంతమందికి మరింత ఎక్కువగా పోస్తుంది. మరికొంత మందికి చాలా తక్కువగా చెమట పడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా చెమట పడుతుంది. చెమట పట్టడం అనేది చెడ్డేమీ కాదు. ఇది శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. కాని చెమటతోబాటు దుర్గంధం రావడం కాస్త ఇబ్బందికరమైన విషయం.
ఇక ఎండాకాలం తలలో కూడా ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. దుమ్ము, ధూళి చేరి ఒక రకమైన దుర్వాసన కూడా వస్తుంది. ఇదిలా కొనసాగితే జుట్టు మురికిగా మారి ఎక్కువగా రాలడం మొదలవుతుంది. కాబట్టి ఎండాకాలంలో వారంలో రెండుమూడుసార్లు తలను శుభ్రం చేసుకోవాలి.
అందుకోసం గులాబీ నీటిని ఉపయోగించి ప్రత్యేకమైన పూతలతో జుట్టును పట్టులా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం…
కలబందతో ప్యాక్:
ఈ ప్యాక్ వేసుకునే సమయంలో జుట్టుకు నూనె లేకుండా చూసుకోవాలి. ముందుగా కప్పు గులాబీ నీటిలో చెంచా కలబంద గుజ్జును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారంలో ఒకట్రెండుసార్లు చేస్తే జుట్టు ఫ్రెష్గా మారుతుంది. దుర్వాసన రాదు. వెంట్రుకలు కాంతివంతంగా, పట్టులా మెరుస్తాయి.
టీ పొడి తో ప్యాక్:
ఈ ప్యాక్ ని తలస్నానానికి ముందు వేసుకోవాలి. ముందుగా కప్పు నీటిని వేడి చేసి అందులో టీ బ్యాగు వేయాలి. చల్లారిన తర్వాత ఈ టీ నీళ్లలో గులాబీ నీళ్లు కలపాలి. ఈ ద్రావణంతో జుట్టును తడిపి కాసేపు మర్దనా చేసుకుని ఆ తర్వాత షాంపు చేసుకుంటే సరి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. చిట్లడం తగ్గుతుంది.