తిరుమల తిరుపతి లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం మార్చి 13 వ తేదీన స్వామివారి విగ్రహ ప్రతిష్ట, మహాకుంబాభిషేకం జరుగనుంది. మరి ఈ శ్రీవారి ఆలయంలో దాగి ఉన్న విశేషాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబరు 92 లోని టెలిఫోన్ కాలనీలో 3.7 ఎకరాల విస్తీర్ణంలో ఒక చిన్న కొండపైన తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారికి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కూడా తిరుమల తిరుపతి ఆలయాన్ని పోలి ఉంటుంది. అయితే టిటిడి వారు ఇదివరకు హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మించగా ఇది రెండవ ఆలయం. ఇక్కడే పక్కన మహాగణపతి ఆలయాన్ని కూడా నిర్మించారు. అయితే 2016 ఆగస్టు లో ఈ ఆలయ శంకుస్థాపన జరుగగా ఈ నెల 13 వ తేదీన స్వామివారి విగ్రహ ప్రతిష్ట, మహాకుంబాభిషేకం జరుగనుంది.
ఈ ఆలయం నిర్మించడానికి దాదాపుగా 28 కోట్ల ఖర్చు అవ్వగా, ఇక్కడ శ్రీవారి విగ్రహం తమిళనాడు రాష్ట్రంలో లభించిన ఒక నల్లటి గ్రానైట్ రాయితో తయారుచేయగా ఈ ఆలయంలోని శ్రీవారి విగ్రహం కూడా తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఇక ఇప్పటికే వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో అన్ని పూజలు జరుగుతుండగా మార్చి 13 వ తేదీన ఉదయం రెండు గంటల నుండి సుప్రభాతం, 5 నుండి 6 గంటల మధ్య ఉత్సవ మూర్తులను ఊరేగించి, 6 గంటల నుండి 7:30 గంటల మధ్య మహాకుంబాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి 5:30 గంటల వరకు శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తారు.
ఇలా ఎన్నో విశేషాల మధ్య టిటిడి వారు కొత్తగా నిర్మిస్తున్న ఈ ఆలయంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారు మార్చి 13 నుండి భక్తులకి దర్శనం ఇవ్వనున్నాడు.