మన తాతల కాలంలో వయసైపోయిన ముసలి వాళ్ళు చూపు మందగించి కళ్ళజోడు వాడేవారు. కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే కొంతమంది పిల్లలకు సైట్ వచ్చేస్తుంది. మొబైల్ ఫోన్ల వాడకం రోజు రోజుకీ ఎక్కువవుతుండడం, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికాల వాడకం పెరగడం, పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యలు.. తదితర అనేక కారణాల వల్ల అనేక మందికి కంటి చూపు సన్నగిల్లుతోంది. చూపు సరిగ్గా ఉండడం లేదు. దీంతో చిన్న తనం నుంచే అనేక మంది కంటి అద్దాలను ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎనిమిది, తొమ్మిదేండ్లకే సైట్ సమస్య పెరిగిపోతోంది. దానికి తోడు వర్క్ ఫ్రమ్హోమ్, ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అంటూ స్క్రీన్ టైమ్ కూడా పెరిగిపోయింది. దాంతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ కళ్లద్దాలు కంపల్సరీ అయిపోయాయి. అయితే వాటి నుంచి విముక్తి పొందాలంటే తరచూ పౌష్టికాహారం తీసుకోవాలి. అందుకు గాను ఆ ఆహారంలో కంటి చూపును పెంచే పోషకాలు ఉండాలి. ఆ పోషకాలు ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్లు బాగుండాలంటే కావాల్సిన విటమిన్స్ ఏ,సీ, ఈ, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. ఇవి పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే దృష్ఠిలోపాలను తగ్గించుకోవచ్చు. మరి ఆ పదార్థాలు ఏంటంటే.. క్యారెట్స్, కాప్సికమ్, పాలకూర, స్ట్రాబెర్రీస్స్, చిలగడదుంప, అన్ని నిమ్మ జాతి పండ్లు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సాల్మన్, ఫ్లాక్స్ సీడ్ కూడా మంచివే. ఇవే కాక ఆకుకూరలు, బ్రకోలీ, ఎగ్స్ కూడా చాలా మంచిది.
నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లు వాపులకు గురి కాకుండా చూస్తుంది. ఉసిరికాయలను లేదా వాటి రసం లేదా పొడిని నిత్యం తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కంటి చూపు మెరుగు పడుతుంది. ఉసిరికాయల్లో ఉండే కెరోటీన్ కంటి చూపును మెరుగు పరిచి కంటి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
బొప్పాయి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్ ఉంటాయి. ఇవి కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. ఈ పండ్లలో ఉండే లుటీన్, జియాజాంథిన్ అనబడే సమ్మేళనాలు సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి మన కళ్లను కాపాడుతాయి. అలాగే మునగ ఆకులలో విటమిన్ – ఎ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటి ఆకులను పప్పుతో కలిపి వండుకుని తింటే కళ్ళకు చాలా మంచిది.
టమాటాల్లోనూ లుటీన్ ఉంటుంది. దీంతోపాటు వీటిలో లైకోపీన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కెరోటినాయిడ్స్ జాబితాకు చెందుతాయి. ఇవి కాంతి బారి నుంచి కళ్లను సంరక్షిస్తాయి. జామ పండ్లలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. కంటి చూపు తగ్గకుండా చూస్తాయి.
మామిడి పండ్లలో ఉండే బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండ్లలో విటమిన్ ఎ కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది కళ్లు పొడిబారడం, దురదలుగా ఉండడం వంటి సమస్యల నుంచి బయట పడేస్తుంది. అలాగే రోజ్ వాటర్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కండ్లకలక లేదా పింక్ ఐ, వాపు నుండి బయటపడటానికి సహాయపడతాయి. రోజ్ వాటర్లో శుభ్రమైన పత్తిని ముంచి మూసిన కనురెప్పలపై మెత్తగా రుద్దవచ్చు. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
మెదడుతో పాటు కళ్లకు కూడా బాదం పప్పులు ఎంతగానో మేలు చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఉంటాయి. విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది కళ్లకి చాలా ముఖ్యం. రోజూ 8-10 ఎండుద్రాక్షలను లేదా 4 నుండి 5 బాదంపప్పులను నీటిలో నానబెట్టి ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తినాలి. ఇవి కళ్లకు రక్షణను అందిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
తేనె మన శరీరానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి శ్రేయస్సు కోసం ఒక టీస్పూన్ తేనెతో తాజా ఉసిరి కాయ జ్యూస్ను రోజూ తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే దీనిని తీసుకోవాలి. ఇది కంటికి మేలు చేస్తుంది. తాజా ఉసిరి లభించకపోతే ఉసిరిక పొడిని కూడా ఉపయోగించవచ్చు.