అహోబిలం రెండు భాగాలుగా ఉంటుంది. పర్వతంపైనగల భాగాన్ని ఎగువ అహోబిలమనీ, పర్వతం క్రింద ఉండే భాగాన్ని దిగువ అహోబిలం భక్తులు పిలుస్తుంటారు. ఎగువ అహోబిలంలో అహోబలేశ్వర ఆలయం ఉంది. తొమ్మది కిలోమీటర్ల ఎత్తులో ఉండే పర్వతంపై ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో ఎన్నో జలపాతాలు, పచ్చని ప్రకృతి సౌందర్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. గుండ్రని రాళ్ళతోనిండిన ఎగువ అహోబిలంలో ఎన్నో మండలాలు ఉన్నాయి.
ఈ ఆలయంలో ఉన్న కోనేటిలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అహోబలేశ్వర ఆలయంలోని స్వామివారికి అర్చన నిమిత్తం పెంచే పూల తోటల కోసం ప్రధానంగా ఈ నీటిని వాడుతుంటారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఈ ప్రాంతం హిరణ్యకశిపుడనే రాజు పరిపాలించిన ప్రాంతం. స్తంభాన్ని చీల్చుకుని భీకర రూపంలో నారసింహుడు దుష్టుడైన హిరణ్యకశిపుడిని సంహరించిన దివ్య ప్రదేశం ఇదే. ఇక్కడ నరసింహ స్వామి ఉగ్రరూపంలో దర్శనమిస్తాడు.
ఇక్కడ వైష్ణవ సంప్రదాయ ప్రసాదాలను, భక్తులు తెచ్చిన వివిధ రకాల ఫలాలను నారసింహుడికి నివేదన చేస్తారు. నారసింహ జయంతిని, చెంచులక్ష్మితో ఆయన కళ్యాణాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున, అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఇక రెండోది దిగువ అహోబిలం. ఇక్కడ ప్రహ్లాద వరద నారసింహ ఆలయం ఉంది. విజయనగర రాజుల శిల్పశైలితో మూడు ప్రాకారాల మధ్యలో వెలసిన ఈ ఆలయం వీక్షుకుల్ని విశేషంగా ఆకట్టుకుని తన్మయత్వంలో ముంచెత్తుతుంది. ఆలయ సమీపంలోని ఆళ్వారు కోనేరు వద్ద ఎగువ, దిగువ అహోబిలాల ఆలయాల్లో పనిచేసే అర్చకులు నివాసం ఉంటారు. ఇక్కడ భక్తుల వసతికోసం ఎన్నో మండపాలను నిర్మించారు. దిగువ అహోబిలంలో సహజ శిలలో నరసింహుడు కొలువైయున్నాడు.ఇక్కడి రంగమండపంలో గుర్రాలపై ఎక్కిఉన్న యక్షులు, విజయనగర శిల్పకళా వైభవంతో అలరారే వివిధ వాద్యకారులు, అతివలు, రామలక్ష్మణుల శిల్పాలు, నరసనాయక విగ్రహాలు శోభాయమానంగా కనిపిస్తాయి.
ఆలయ చరిత్రను చూస్తే.. నారసింహుడి రూపంలోని శ్రీ మహావిష్ణువు భీకర రూపాన్ని దర్శించిన దేవతలు అహోబిలం, అహోబిలం అంటూ స్వామివారిని కీర్తించారట. అదే విధంగా ఇక్కడ పెద్ద పెద్ద గుహలు ఉండటంవల్ల అహోబిలంగా కీర్తించబడింది. ఇక్కడ స్వామి వారు స్వయంగా ఉగ్ర నరసింహ అవతారం లో వెలిశారు. ఈ పుణ్యక్షేత్రానికి 2000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆంధ్రప్ర్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డలో నెలకొన్న ఈ ఆలయం నంద్యాలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా పేరొందిన అహోబిలంను సింగవేల్ కుండ్రం అని కూడా పిలుస్తుంటారు.