Home Unknown facts ఎనిమిది హైందవ దేవాలయాలు ఒకే చోట ఉండే భైరవకోన

ఎనిమిది హైందవ దేవాలయాలు ఒకే చోట ఉండే భైరవకోన

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడదగ్గ పుణ్య క్షేత్రాల్లో భైరవ కోన ఒకటి. ఈ క్షేత్రం ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామం సమీపంలో ఉంది. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి.అత్యంత ప్రాచీన పల్లవ దేవాలయానికి ఆభిముఖంగా ఎనిమిది చిన్నచిన్న దేవాలయాలున్నాయి. అక్కడక్కడ చెక్కిన శిలలపై ఉన్న ఆధారాలను బట్టి ఇవి 7, 8 శతాబ్ధాలకు చెందినవని తెలుస్తుంది.

Bhairavakonaదక్షిణ భారతదేశంలో మొట్టమొదట కనుగొన్న ప్రాచీన హిందూ దేవాలయాలు ఈ భైరవకోనలోనివే. భైరవకోనలో ఎనిమిది హైందవ దేవాలయాలున్నాయి. పల్లవ శిల్పకారుడైన దేరుకంతి, శ్రీశైలముని మొదలైనవారు భైరవకోన క్షేత్రాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. భైరవకోనలోని మరో విశేషం అందాల జలపాతం. ప్రకృతి అందాన్ని ఆశ్వాదించేవారికి కన్నుల పండుగలా…. ఎత్త్తెన కొండలపై ఉన్న లింగాల దొరువు నుండి ప్రవహించి 200మీటర్ల ఎత్తునుంచి పడుతూ ఇక్కడకు వచ్చే యాత్రికులకు కనువిందు చేస్తోంది. ఒకే కొండ‌లో ఎనిమిది ఆల‌యాలు… చుట్టూ ఎక్కడ చూసినా న‌ల్ల‌మ‌ల అడ‌వుల సోయగం, అందులో దేవుళ్ళు అందమైన శిలా రూపంలో దర్శనమిస్తారు.

భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన శివుని ఆలయం. ఇక్కడ ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహంమీద కార్తీకపౌర్ణమిరోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆ రోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలి వస్తారు. శివరాత్రి రోజున పక్కనే ఉన్న జలపాతపు సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు. ఇక్క‌డ ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖానికీ ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగానూ చెక్కబడ్డాయి. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు.

ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరుపర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వరిలింగం, భర్గేశ్వరలింగం, రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధన చేస్తారు.

ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. మిగిలినవన్నీ తూర్పుముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోబాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కడం విశేషం. ఇక్క‌డ దుర్గాదేవి ఆలయానికి కొంచెం క్రిందిభాగంలో సెలయేరు ప్రవహిస్తుంటుంది. ఈ సెలయేరు వేసవిలో కూడా తడి ఆరకుండా ప్రవహిస్తుంది. అయితే అతిగా వర్షాలు పడినప్పుడు ఈ సెలయేరు ఎంత వేగంగా ప్రవించినప్పటికీ ఆలయములోకి ఒక చుక్క నీరు అనేది కూడా రాకపోవడం విశేషం.

Exit mobile version