ఈ ఆలయంలో భీమేశ్వరస్వామి లింగరూపంలో భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఇంకా ఈ ఆలయం ఆవరణలో ఉన్న రావి చెట్టు కింద మహా గణపతి ఒకవైపు, దాసాంజనేయుడ్ని మరొక వైపు ప్రతిష్టించారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, మచిలీపట్నం నుండి సుమారు 40 కి.మీ. దూరంలో గుడివాడ పట్టణ నడిబొడ్డున శ్రీ భీమేశ్వరస్వామి వారి దేవాలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయ ప్రవేశానికి తూర్పువైపు, దక్షిణవైపు రెండు ద్వారాలు ఉన్నాయి. ఇక ముఖ ద్వారం రెండు అంతస్తులుగా ఉంది. చతుర్భుజులైనా ద్వారపాలకులు శంఖు, చక్ర, గదలతో ద్వారాలకు ఇరువైపులా నిలిచి ఉన్నారు.
గర్భాలయానికి ఒక పక్కన ఉన్న ఉత్సవ మంటపంలో గోడకు పరమేశ్వరుడు పార్వతి దేవితో కలసి ఉన్న శిల్పం ఎంతో ఆకర్షిస్తుంది. ఆలయ ముఖమండపం పైన నారదుడు, తుంబురుడు, శ్రీరాముడు, పరమేశ్వరుడు, బ్రహ్మ మొదలైన విగ్రహాలు ఉంటాయి.
ఈ ఆలయ ప్రాగణంలో రావి చెట్టు కింద పెద్ద పుట్ట ఉంది. ఈ వృక్షం మొదలులో మహా గణపతి ఒకవైపు, దాసాంజనేయుడ్ని మరొక వైపు ప్రతిష్టించారు. ఇక్కడే కొద్దీ దూరంలో నాగబంధం, తులసికోటను ప్రతిష్టించారు. నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి లాంటి పర్వ దినాల్లో భక్తులు సుబ్రహ్మణ్యస్వామిని ఘనంగా అర్చిస్తారు.
భీమేశ్వరస్వామి కొలువ ఉన్న ఈ ఆలయంలో నిత్యం, అభిషేకాలు, పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకి గ్రహబాధలు తొలగి కోరిన కోర్కెలు సిద్దించడం వలన ఈ ఆలయాన్ని దర్శించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు.