రామాయణంలో సీతారామలక్ష్మణులు వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరించి తీసుకొని వెళ్లగా శ్రీరాముడు సీతాదేవి కోసం వెతుకుంటూ వెళుతుంటే మార్గమధ్యంలో హనుమంతుడు ఇంకా వానరసైన్యం శ్రీరామునికి ఎదురై అయన వెంటరాగా వారిని నాలుగు భాగాలుగా విభజించి సీతాదేవి జాడ కనిపెట్టడానికి పంపించగా ఆ ప్రదేశం ఇదేనని చెబుతున్నారు. మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఒంగోలు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో చెదలవాడ అనే గ్రామంలో శ్రీ రంగనాయకస్వామి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. తేత్రాయుగంలో అగస్త్య మహర్షి స్వామివారిని దక్షిణ ముఖంగా ప్రతిష్టించాడు. అయితే సీతాదేవి అన్వేషణ కోసం శ్రీరాముడు వానర సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి నాలు దిక్కులకు పంపాడని పురాణం.
ఇలా వానరసైన్యాన్ని పంపడం వలన ఈ ప్రాంతానికి చతుర్వాటీకా అనే పిలువబడుతూ కాలక్రమేణా చదలవాడ గా పిలువబడుతూ వస్తుందని చెబుతారు. ఇక విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం బాగా వెలుగులోకి వచ్చినది. ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి దగ్గరలోనే ఆంజనేయస్వామి ఉండగా, గర్భాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు దర్శనం ఇస్తుంటారు.
ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం తొమ్మిది రోజుల పాటు చాలా వైభవంగా జరుపుతారు. ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి చుట్టూ పక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.