ప్రకృతి సృష్టించిన గొప్ప ఆకర్షణల్లో జలపాతాలు ఒకటి. మన దేశంలో ఎన్నో ఎత్తైన, ఆకర్షణీయమైన జలపాతాలు ఉన్నాయి. వాటిలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఉన్న చిత్రకూట్ జలపాతాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నయాగరా జలపాతాలను పోలి ఉండే చిత్రకూట్ జలపాతాలు దాదాపు 1000 అడుగుల వెడల్పు మేర విస్తరించి 100 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడుతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
జగదల్పూర్ పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రకూట్ జలపాతాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఋతువు ఋతువుకు రంగులు మారడం ఈ జలపాతం విశేషత. వర్షాకాలంలో ఇది మరింత ఆకర్షణను కలిగి ఉంటుంది. భారీ వర్షాలకు ఇంద్రావతి నది నుంచి వచ్చే వరద నీరుతో ఈ జలపాతాలు కొత్త శోభను సంతరించుకుంటాయి.
నీరు బాగా ఉన్న సమయంలో దీని వెడల్పు మరింత పెరుగుతుంది. వెడల్పు కారణంగానే దీన్ని భారతదేశపు నయాగరా అని అంటారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నపుడు ఈ జలపాతం మూడు పాయలుగా దూకుతుంది. చిత్రకోట్ జలపాతం గుర్రపునాడా ఆకరంలో ఉంటుంది. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉన్నపుడు, గుర్రపు నాడా మొత్తంపై నీరు దూకుతూ ఉంటుంది.
భారీ వర్షాలకు ఇంద్రావతి నది ప్రవాహం ఎర్ర మట్టి పెల్లలతో కలిసి ఎర్ర రంగులోకి మారుతుంది. క్రమంగా శీతాకాలంలో ఈ నీరు తెలుపు రంగులోకి మారుతుంది. వీటికి తోడు జలపాతం వద్ద ఆవిష్కృతమయ్యే ఇంద్రధనస్సు రంగులతో ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూస్తూ పర్యాటకుల మనసు పులకిస్తుంది. ఈ ప్రకృతి సోయగాలను చూడడానికి దేశవిదేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
ఈ జలపాతం ఒడ్డున పెద్ద శివలింగం, మహానందితో కూడిన ఆలయంను దర్శించవచ్చు. ఇక్కడ జలపాతం దిగువన భాగంలో నీటిలో విహరించుటకు పడవ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్రదేశానికి కొద్దిపాటి దూరంలోనే కాంగర్ లోయ (ఘాటీ ) నేషనల్ పార్క్ మరియు తీరథ్ గఢ్ జలపాతం ఉన్నాయి.