పూర్వం ఒక సిద్ధపురుషుడు పెద్ద మర్రిచెట్టు క్రింద ధ్యానం చేస్తూ సిద్దిపొందగ అక్కడే ఆత్మదైవంగా వెలిశాడని పురాణం. భూత, ప్రేత, పిశాచాలు పట్టినవారు ఈ స్వామిని దర్శిస్తే అవి దూరమవుతాయని చెబుతారు. మరి ఆ సిద్ధపురుషుడు ఎవరు? ఈరన్న గా ఎలా వెలిసాడు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలుజిల్లా, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉరుకుంద గ్రామంలో ఈరన్న దేవాలయం ఉంది. ఈ ఆలయం అతిపురాతన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం ఉండే ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక సిద్ద పురుషుడు జీవించి ఉండేవాడని సిద్ది పొందిన తరువాత ఆయనే ఇక్కడ ఆత్మదైవంగా మారి ఇక్కడ వెలసినట్లుగా చెబుతారు. ఇక్కడ వెలసిన ఈ ఈరన్నస్వామిని భక్తులు గ్రామదేవతగా కొలుస్తారు.
ఇక ఈ ఆలయ స్థలపురాణానికి వస్తే, పూర్వం ఈరన్న స్వామి జన్మించిన తరువాత అయన తల్లితండ్రులు అతడికి హిరణ్య అనే పేరుని పెట్టారట. అయితే అయనకి 12 సంవత్సరాల వయసు ఉన్నపుడు ఉరుకుంద గ్రామానికి ఆవులను మేపడానికి వెళ్లి అక్కడ ఉన్న ఒక రావిచెట్టు క్రింద కూర్చొని తపస్సు చేసుకునేవాడు. ఒకరోజు ఆ దారిలో వెళుతున్న ఒక సిద్ధుడు అయన దగ్గరికి వచ్చి ఆధ్యాత్మిక విషయాలను బోధించి, దైవధ్యానం చేస్తూ జీత కాలమంతా శ్రీ నరసింహస్వామి సాన్నిధ్యంలో ప్రసిద్ధిచెందమని ఆ సిద్ధుడు ఆయన్ని ఆశీర్వదించాడట. ఇక అప్పటినుండి అయన బాలబ్రహ్మచారిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం.
ఇలా రెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈరన్నస్వామి చూపించిన మహిమలు అనేకం అని చెబుతారు. ఇప్పటికి కూడా ఈ స్వామి అగ్ని ఆకారంలో ఈ ప్రాంతంలోనే రాత్రి వేళలో సంచరిస్తాడని, ఇంకా ఈ గ్రామం పైన ఉండే ఆకాశంలో ఒక ద్విపంలాగా కనిపిస్తుంటాడని, తెల్లని గడ్డంతో విహరిస్తుంటాడని అంటారు. ఇక చాలామంది భక్తులు వీరన్నస్వామి ఉన్న గర్బాలయంలోకి వెళ్లలేమని, ఒకవేళ వెళితే ఏదో తెలియని వణుకు వారిలో పుడుతుందని చెబుతూ ఉంటారు. భూత, ప్రేత, పిశాచములు పెట్టినవారు, మానసిక ఆందోళన కలిగిన వారు ఈ స్వామిని దర్శిస్తే వారి బాధలు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, పూర్వం ఇక్కడి ఉన్న పెద్ద రవి చెట్టు క్రింద ఆ స్వామి తపస్సు చేసుకున్న కారణంగా ఇప్పటికి ఈ చెట్టుకి భక్తులు పూజలు చేస్తుంటారు. ఈరన్నస్వామి గ్రామాన్ని రక్షించే వీరభద్రుడి రూపంలో కొలువలని అనుకున్న తరువాత వీరభద్రస్వామి విగ్రహాన్ని చేయించి ఈ చెట్టు క్రిందే ప్రతిష్టించారు. ఆ సమయంలోనే ఇక్కడ తవ్వకాల్లో వారికీ చెట్టుక్రింద నరసింహస్వామి విగ్రహం లభించింది. దాంతో ఈ రెండు విగ్రహాలను చెట్టు క్రిందే ప్రతిష్టించారు.
ఈ ఆలయం గురించి మరొక సంఘటన వెలుగులో ఉంది. ఒకసారి కర్ణాటక నుండి మంత్రాలయం వెళుతున్న రాఘవేంద్రస్వామి పల్లకి ఉరుకుందలో అనుకోకుండ ఆగిపోయి ఇంతకీ పల్లకి కదలకపోవడంతో అప్పుడు రాఘవేంద్రస్వామి తన దివ్యదృష్టితో ఈ ఆలయ మహిమను గుర్తించి ఇక్కడి నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాడట.
ఇక్కడ ఉన్న ఆ రావి చెట్టు లక్ష్మినరసింహస్వామి నివాసమని, సిద్ధపురుషుడైన ఈరన్నస్వామి కారణంగా ఈ క్షేత్రానికి ఉరుకుందా ఈరన్న అని, నరసింహస్వామి ప్రతీకగా అశ్వత వృక్షం నందున ఉరుకుంద శ్రీ నరసింహస్వామి అని పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఇక పెద్ద రావి చెట్టు క్రింద వెలసిన నరసింహస్వామి, వీరబద్రస్వామి విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించారు కానీ ఈ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు. ఈవిధంగా వెలసిన ఈ స్వామివారికి ప్రతి శ్రావణమాసంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.