కోహినూర్ వజ్రం… దీని కోసం యుద్ధాలు జరిగాయి. ప్రాణాలు పోయాయి. పుట్టినిల్లు భారత్ అయినప్పటికీ ఆ వజ్రం మాత్రం పరాయి దేశపు చేతుల్లో వుంది. మాది మాకు ఇవ్వండి అని గట్టిగా గొంతు ఎత్తి అరిచినా పట్టించుకునేనాధుడు లేడు. అసలు ఏం జరిగింది. కోహినూర్ వెనకున్న రహస్యమేమిటి?ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్రిటిష్రాణి కిరీటంలో రెండువేల ఎనిమిదివందల వజ్రాల మధ్య రారాజులా వెలిగిపోతున్న కోహినూర్ వజ్రాన్ని, సుల్తాన్గంజ్ బుద్ధ విగ్రహాన్ని ఇవ్వాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనను బ్రిటన్ తోసిపుచ్చింది. కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు. బ్రిటిష్ రాజకుటుంబం కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్దకోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది.
బాబర్ చక్రవర్తి నూట ఎనభైఆరు క్యారెట్ల బరువైన ఆ వజ్రం ఖరీదు ‘ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినంత’ అన్నాడట. ఆల్బర్ట్ యువరాజు దానిని సానబట్టిస్తే రెండువేల వజ్రాలు అరిగిపోయాయి. బరువు కూడా నూటఅయిదు క్యారెట్లకు పడిపోయింది. అందుకోసం బాబర్ నామాలో మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూర్ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ “ఇది ఎంత విలువైనదంటే దీని వెల ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినంత’ అని రాసాడు.
కోహినూర్ పర్షియన్ పదం. ఒక మహాపర్వతమంత కాంతిని ప్రసరింపజేయగల దివ్యరత్నమిది. ఈ వజ్రం యొక్క ప్రభావానికి సమ్మోహితులైన ఎందరో రాజన్యులు, చక్రవర్తులు దీనిని స్వంతం చేసుకోవడానికి తహతహలాడారు. ఈ వజ్రం కోసం యుద్ధాలు చెలరేగి, రక్తపాతం జరిగింది. బంధుత్వాలు, రక్త సంబంధాలు మరచి ఒకరినొకరు మోసం చేసుకున్నారు. హత్యలు చేశారు. తీవ్రమైన హింసలకు గురయ్యారు. దీన్ని రక్షించుకోవడానికి పడ్డ తపనలో ఎంతో మానసిక వేదన అనుభవించారు. శతాబ్దాల తరబడి చేతులు మారుతూ, ఈ వజ్రం చేసిన బహుదూర ప్రయాణం ఎంతో దూరం. ఈ వజ్రం చుట్టూ ఎన్నో చరిత్రలు తిరిగాయి. కథలూ, గాథలూ, కల్పనలూ అల్లుకున్నాయి. ప్రపంచంలో ఏ వజ్రానికి దక్కని ప్రత్యేకతను స్వంతం చేసుకున్న ఈ అనర్ఘరత్నం జన్మస్థానం ఆంధ్రదేశం. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో కొల్లూరులో విశ్వవిఖ్యాత కోహినూర్ వజ్రం దొరికింది.
కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, మొత్తం భారతదేశంలో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూర్ అనగా కాంతి పర్వతం అని అర్ధం. కోహినూర్ వజ్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వజ్రంగా పరిగణింపబడింది. 105కేరట్లు గల ఈ వజ్రం చరిత్రలోనే పలు వివాదాలకు కారణమైంది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఆయన చేతిలో క్రీ.శ.1300లో ఈ వజ్రం ఉండేదని, క్రీ.శ.1305లో వింధ్యకు నర్మదకు మధ్యభాగాన్ని దాదాపు వేయి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలకవంశాన్ని తుదకు అల్లాఉద్దీన్ జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూరును కూడా స్వాధీనం చేసుకున్నారు.
1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది. అన్ని ప్రఖ్యాత వజ్రాలవలె కోహినూరు వజ్రము చుట్టూ పలు కథలు, కథనాలు అల్లబడ్డాయి. ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు చేకూర్చునట్లు చెప్పబడుతుంది.