మహాశివుని జటాజూటాల నుండి ఉద్భవించాడు వీరభద్రుడు. పరమేశ్వరుని కోపం నుండి పుట్టిన వీరభద్రుడిని శివుడి ప్రతిరూపంగా కొలుచుకుంటాము. అలాంటి వీరభద్రుడు స్వయంగా వెలిసిన క్షేత్రం కొత్తకొండ వీరభద్రుడి ఆలయం. తెలంగాణ రాష్ట్రం, వరంగల్ అర్బన్ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఉంది.
ఈ చారిత్రాత్మక వీరభద్ర స్వామి ఆలయం.ప్రతి సంవత్సరము జనవరి నెలలో సంక్రాంతి ముందురోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రాధాన ఆకర్షణ… బోనాలు, బండ్లు తిరగడం. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమినాడు 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ జాతరకు ప్రతీ ఏట చుట్టూ పక్కల ప్రాంతాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మాజీ ప్రధాని పీ వి నరసింహారావు స్వస్థలం వంగరకు 10km ల దూరంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు.
చరిత్ర ప్రకారం దేవుడు వెలిసిన కాలాన్ని కచ్చితంగా చెప్పే ఆధారాలు లేకపోయినా ఏళ్ళ క్రితం గుట్టమీద వెలిసిన విగ్రహాన్ని ప్రస్తుత ఆలయంలో ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. క్రీ.శ.1600వ సంవత్సర కాలంలో కట్టేల కోసం కొందమంది కుమ్మరులు ఎడ్లబండ్లతో కొండపైకి వెళ్లారట. కట్టెలు దొరికిన తరువాత అలసిపోయిన కుమ్మరులు అక్కడే కాసేపు నిద్రపోయారు. కొద్ది సేపటి తరువాత లేచి చూడగా, ఎడ్లు కనిపించలేదు . వాటిని వెతుకుతూ వెతుకుతూ రాత్రి అవడంతో అక్కడే పడుకున్నారు.
ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నున్న తన విగ్రహాన్ని కిందకి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్టిస్తే వారి ఎడ్లు దొరుకుతాయిని చెప్పడట. దాంతో గుట్ట కింద ఆలయాన్ని నిర్మించి వీరభద్రస్వామిని ప్రతిష్టించినట్లు స్థానికులు చెబుతారు .స్వామి వారిని క్రిందికి తీసుకువచ్చే క్రమంలో స్వామివారి విగ్రహం కాలు విరిగినట్లు కూడా చెబుతారు. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ళ మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన గుట్ట పైన కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహత్యమే అని గ్రామ ప్రజలు నమ్ముతారు.
జనవరి 10న శ్రీ వీరభద్రస్వామి కల్యాణం జరుగగా, 14న కుమ్మరుల ఎడ్ల బండ్లు ఆలయం చుట్టూ తిప్పుతారు. 15న దర్శనానికి వచ్చిన భక్తుల వాహనాలు ఆలయం చుట్టూ తిప్పడం ఆనవాయితీగా వస్తుంది , 16న నాగవెల్లి, వసంతోత్సవం, 18న అగ్నిగుండాలు అనంతరం స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘట్టాలు. ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా భక్తులు గండాలు తీరాలని గండదీపం, వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు బీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు.