మన దేశంలో గ్రహాలకు సంబంధించిన ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ అందులో ఒకే గ్రహానికి విడిగా ఆలయాలు ఉండటం అనేది అరుదు. అలానే దేశం మొత్తంలో కేతు గ్రహానికి ఉన్న ఏకైక ఆలయం ఇదేనని చెబుతారు. మరి ఈ కేతు గ్రహ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, కుంభకోణం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ చంద్రగ్రహ, కుజ గ్రహ, బుధ గ్రహ, గురు గ్రహ, శుక్ర గ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతు గ్రహ ఆలయాలు మనకి దర్శనం ఇస్తుంటాయి.
ఇక కేతు గ్రహ ఆలయ విషయానికి వస్తే, తిరువెన్నాడు నుండి కొంత దూరంలో కేజ్ పేరంపాలెం అనే గ్రామంలో కేతు గ్రహ ఆలయం ఉంది. కేతు గ్రహానికి ఇలా ప్రత్యేకంగా నిర్మించిన ఆలయం ఇదేనని చెబుతారు. ఇక్కడ రాహు కేతువులు జంటగా సర్పాకారంలో కలసి ఉండి, క్షిరసాగరమధనంలో శివునికి సహాయం చేసారని ప్రతీతి. ఇంతటి మహిమగల ఈ ఆలయంలో శివుడు మహిమాన్వితుడు.
ఇలా కేతు గ్రహానికి అంకితమైన ఈ ఆలయంలో కేతు గ్రహ దోష నివారణకై ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ ఆలయ వద్ద పూజ సామాగ్రి లో భాగంగా ఒక ప్లేటులో 7 దీపాలు వెలిగించడానికి వీలుగా 7 ప్రమిధులను అమర్చి ఇస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కేతు గ్రహానికి దానంగా ఉలువలను సమర్పించి, ఏడు దీపాలను వెలిగించి పూజిస్తారు.
ఇక ఈ ఆలయం లో ఉన్న తొమ్మిది పుష్కరిణులలో స్నానాలు చేసి 12 వారాలు ఆరాధించే భక్తులకు నవగ్రహా దేవతామూర్తుల అనుగ్రహం లభిస్తుంది. పూర్వం ఇక్కడ ఎంతోమంది వారి వారి దోషాలను పోగొట్టుకున్నారని పురాణం. ఇంతటి మహిమ గల ఈ ఆలయానికి ఎప్పుడు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కేతుగ్రహ దోషం పోగొట్టుకోవడానికి పూజలు చేస్తుంటారు.