శత్రు దుర్భేద్యమైనది ఈ పద్మవ్యూహం రహస్యం ఏంటీ ?

పద్మవ్యూహం.. వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ‘చక్రవ్యూహం’ అని కూడా వ్యవహరిస్తారు. ఇది శత్రు దుర్భేద్యం అయినది. అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం. లోపలికి వెళ్ళిన కొద్దీ.. చావును దరికి చేర్చే మృత్యుబిలం. ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది ఈ పద్మవ్యూహం. అసలు ఏంటీ పద్మవ్యూహం రహస్యం? దాని గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు? కురుక్షేత్ర సంగ్రామం సమయంలో కౌరవుల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్ళాడు? అసలు ఎలా వెళ్లగలిగాడు? ఎందుకు తిరిగి రాలేకపోయాడు? ఇలాంటి ఆసక్తికర విషయాలు మన ఇపుడు తెల్సుకుందాం..

Padmavyuhaఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు ‘పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు’ అంటారు. అదేవిధంగా, ఎవరైనా తమ తెలివితేటలతో ఎదుటివారిని ఆధీనులుగా చేసుకున్నా, తన పద్మవ్యూహంలో చిక్కాడు అంటుండటం విన్నాం.. యుద్ధవ్యూహాల్లో ఎంతో ప్రత్యేకం అయిన పద్మవ్యూహం పెద్ద రహస్యంగ , చిక్కుముడిగా ఉండిపోవటానికి కారణం దీన్ని భేదించే నైపుణ్యం కేవలం నలుగురికే తెలిసి ఉండటం. అందులో అర్జునుడు కూడా ఒకడు. అర్జునుడి కుమారుడే అభిమన్యుడు.. పద్మవ్యూహం అనగానే మనలో అందరికి గుర్తిచేది అభిమన్యుడే ..పద్మవ్యూహం ద్రోణాచార్యునిచే నిర్మింపడ్డ వ్యూహం.. . భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు. తరవాత రెండు రోజులు యుద్ధం జరిగినా ఇంకా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు ద్రోణుడిని హేళనచేయటంతో, సిగ్గుపడి ఈ గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాడు.

Padmavyuhamఇది దేవతలు కూడా భేదించలేనిదని, మహావీరుడైతే తప్ప దీన్ని భేదించటం సాధ్యం కాదని చెప్తాడు ద్రోణుడు.. పద్మవ్యూహం నిర్మాణం ఎలా ఉంటుందంటే… కౌరవ సేనలు తామరపువ్వు ఆకారంలో నిలువగా.. వివిధ దేశాధిపతులు తామరపువ్వులోని రేకుల మాదిరి నిలిచారు. వారి కుమారులు పువ్వు మధ్యభాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన, వారి మధ్య దుర్యోధనుడూ ససైన్యంగా నిలిచారు. సైంధవుడూ, అశ్వత్థామా, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు, వారి కుమారులూ తమ తమ స్థానాల్లో నిలిచారు. అయితే మహా వీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించటం సాధ్యం కాలేదు. కేవలం అర్జునుడూ, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడుకి మాత్రమే తెలుసు. వీరిలో అర్జునుడిని సంశప్తకులు వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంగా తీసుపోతారు.. అట్టి సందర్భంలో దిక్కుతోచని ధర్మరాజు అభిమన్యుడుని పంపక తప్పలేదు.

Padmavyuhamకుమార అభిమన్యా..! మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించు అని కోరతాడు ధర్మరాజు.. అపుడు అభిమన్యుడు సమరోత్సాహంతో ‘నా తండ్రి నాకీ వ్యూహాన్ని ఛేదించి లోపల ప్రవేశించడం వరకూ చెప్పాడు. అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను’ అన్నాడు. ‘ఆ మాత్రం చాలు కుమారా! నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే, నీ వెనువెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం’ అని సంతోషంగా ధర్మరాజు అన్నాడు. పక్కనే ఉన్న భీముడు కూడా ‘కుమారా! నువ్వు వూహ్యాన్ని ఛేదిస్తే చాలు. నీ వెంటనే నేనూ, దృష్టద్యుమ్నుడూ, ద్రుపదుడూ, సాత్యకీ, విరాటుడూ పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రు సేనలను మట్టుపెడతాం’ అని భరోసా ఇచ్చాడు. ‘పద్మవ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను. అందరూ ప్రశంసించేలా రణరంగంలో వీర విహారం చేస్తాను’ అని సంకల్పం చెప్పిన అభిమన్యుడు అన్నంత పనీ చేశాడు. వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏ మాత్రం జంకలేదు.

Padmavyuhamతన సారథి సుమిత్రుణ్ణి ద్రోణుడి వైపు రథం పోనివ్వమని మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చొచ్చుకుని పోయాడు అభిమన్యుడు. కౌరవ సేనలను కత్తికో కండగా నరకడం మొదలు పెట్టాడు. అతడి ధాటికి కౌరవ సేన కకావికలమైంది. పద్మవ్యూహం చెల్లా చెదురైంది. కర్ణుడి కవచ కుండలాల్ని పగలగొట్టి, బాణాల దెబ్బకి మూర్ఛిల్లపోయేలా చేస్తాడు, అలాగే శల్యుణ్ణీ, దుశ్యాసనుణ్ణీ కూడా స్పృహ తప్పేలా చేశాడు. మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారికి కౌరవుల బావమరిది అయిన సైంధవుడ అడ్డు తగిలాడు. ఎందుకంటే ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగిస్తుంది.. అటు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనుణ్ణే పారిపోయేలా చేశాడు. అతడి కొడుకైన లక్ష్మణ కుమారుడినీ, కోసల దేశాధీశుడైన బృహద్బలుణ్ణీ సంహరిస్తాడు..

Padmavyuhamఅలా యుద్ధంలో వీర విహారం చేస్తున్నఅభిమన్యుడిని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్పగా, కౌరవ యోధులు యుద్ధనీతికి వ్యతిరేకంగా అందరూ మూక్కుమ్మడిగా దాడి చేసి అభిమన్యుడిని నిరాయుధుణ్ణీ, విరథుణ్ణీ చేసి బాణ వర్షం కురిపిస్తారు.. . అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయిన అభిమన్యుడు దుశ్శాసనుని కుమారుడుని ఎదుర్కొన్నాడు. వారిద్దరికీ ఘోర సమరం జరిగింది. ఇద్దరి శరీరాల నుంచి రక్తం ధారలు కట్టింది. అలా ఇద్దరూ తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. అభిమన్యుడు విగత జీవుడైనప్పటికీ కౌరవులకు ఇంకా కసి తీరలేదు. వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్దయగా పొడిచి పొడిచి క్రూరంగా వ్యవహరించారు. అభిమన్యుడి మరణవార్త విని దుర్యోధనుడు తెగ సంబరపడిపోతాడు..

ఇక్కడే ఒక ప్రశ్న.. అర్జునుడి సోదరులైన పాండవులకు తెలీని పద్మవ్యూహ ఛేదనం అభిమన్యుడికి ఎలా తెల్సు అని.. ఈ పద్మవ్యూహంలో ప్రవేశం గురించి అభిమన్యుడి తల్లి, కృష్ణుడి సోదరి అయిన సుభద్ర తన భర్త అర్జునుడిని అడుగుతుంది.. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా, సుభద్ర ‘ఊ కొడుతూ’ నిద్రపోతుంది… అప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు అర్జునుడు చెప్తున్నది వింటూ ‘ఊ కొట్టడం’ మొదలు పెట్టాడు. అది గమనించని అర్జునుడు పద్మవ్యూహాంలోకి ఎలా వెళ్లాలో చెప్పేస్తాడు… ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రుదుర్భేద్యమైనది పద్మవ్యూహాన్ని గజ వధ ద్వారా లోపలికి వెళ్లాలని పద్మవ్యూహ రహస్యం అర్జునుడు చెప్తాడు. అయితే తరవాత సుభద్ర నిద్రపోవటం గమనించిన అర్జునుడు పద్మవ్యూహంనుండి బయటికి రావటం గురించి చెప్పడం మానేశాడట.. అలా మాతృ గర్భంలోనుండే పద్మవ్యూహ రహస్యాన్ని తెలుసుకున్నాడు అభిమన్యుడు.. చిన్న వయస్సులోనే వీరోచితంగా పోరాడి యోధుడయ్యాడు..

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR