శ్రీకృష్ణుడి పేరు వినగానే తల మీద నెమలి ఈక, చేతిలో వేణువుతో మాధవుని రూపం మన మనసులో మెదులుతుంది. తల మీద నెమలి ఈకను ఎందుకు ధరిస్తాడు అనే ప్రశ్నకు చరిత్రలో కొన్ని సమాధానాలు ఉన్నాయి. పండితుల కథనం ప్రకారం…. నెమలి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించే ఏకైక పక్షి. మగ నెమలి కన్నీటి తాగి ఆడ నెమలి గర్భం ధరిస్తుంది. అంతటి పవిత్రమైన పక్షి కాబట్టే నెమలికకు కృష్ణుడు తన తలపై స్థానమిచ్చాడు అని చెబుతారు. అయితే చేతిలో మురళి గురించిన రహస్యం మాత్రం చాలా మందికి తెలియదు.
తలమీద నెమలిక లాగానే కృష్ణుని సర్వవేళలా అంటి పెట్టుకుని ఉంటుంది పిల్లనగ్రోవి. ఆ మురళితో నల్లనయ్య వేణుగానం చూస్తుంటే గోపికలతో పాటు సమస్త ప్రకృతి పరవశించిపోయేదట. అయితే గోపాలుడికి తమకన్నా ఎక్కువ చేరువగా ఉండే మురళి అంటే ఇష్ట సఖులకు ఈర్ష్యగా ఉండేదట. ఇదే విషయం ఒకసారి మురళిని అడిగిందట రుక్మిణి. గత జన్మలో ఏ పుణ్యకార్యం చేయడం వలన నీకు ఇంతటి సద్భాగ్యం కలిగింది. ఎప్పుడూ స్వామి వారి చేతులలో ఉండే అదృష్టం కలగడానికి నువ్వు నోచిన నోములేమిటో నాకు చెప్పమని రుక్మిణి కోరిందట.
అప్పుడు వేణువు, నా లోపల ఏమీ లేదు. నా మనసును దృశ్యరహితంగా చేసుకున్నాను. అలా ఏమి లేకుండా ఉండటం వలనే గోవిందుడికి చేరువయ్యాను అని పలికిందట. అంటే దుష్టబుద్దులు, దురాలోచనలు మానివేసి మనసు నిర్మలంగా వుంచుకుని, పవిత్రమైన మనసుతో భగవంతుని ప్రార్థిస్తే ఆయనకు చేరువ కావచ్చు అని దాని అర్థం.