Home Unknown facts శివలింగం పరిమాణం పెరగడానికి కారణం లింగంపై రామబాణం గుర్తేనా?

శివలింగం పరిమాణం పెరగడానికి కారణం లింగంపై రామబాణం గుర్తేనా?

0

శివ లింగం హిందూ మతంలో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది. సాధారణంగా శివలింగము సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠింపబడి ఉంటుంది.

Ramalingeswaraపూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు. వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ కచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోంది.

అయితే షాద్ నగర్ దగ్గర ఉన్న రాయికల్ గ్రామ శివారులోని పంచముఖ గుట్టపై వెలిసిన రామలింగేశ్వరుడిని స్వయంగా శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడని అంటారు. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్టు మాణిక్య ప్రభు చరిత్రలో పేర్కొన్నారు. అంతేకాదు, లింగాన్ని సాక్షాత్తు శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడనడానికి నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తు ఉంటుంది. లంకాధిపతి రావణాసురని సంహరించి సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బదిరీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసారని భక్తుల విశ్వాసం. ప్రకృతి వైపరీత్యాల వల్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనేక వందల ఏళ్లు భూగర్భంలోనే ఉండిపోయినట్టు చరిత్ర చెబుతుంది.

చాలా కాలం తరువాత రామేశ్వరం గుట్టల మధ్య మాణిక్య ప్రభువు శిష్యుడైన నరసింహారాయలు తపస్సు చేస్తుండుగా ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శన మిచ్చాడు. బదిరీ వృక్షం కింద శివలింగం ఉందనీ, దాన్ని బయటకు తీసి పూజలు నిర్వహించాలని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు. దీంతో ఆయన శివలింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాడు.

ఆయన తరువాత నరసింహారాయల శిష్యుడు అప్పకొండ భట్టు దత్తాత్రేయ స్వామి ఆలయం, కోనేరును నిర్మించి రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి చేసినట్టు చెబుతారు. ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్లు ఏర్పడుతున్నాయి.

మిగతా రోజులకంటే మహాశివరాత్రి పర్వదినం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. శివరాత్రి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలను ఇక్కడే విరమిస్తారు. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం షాద్‌నగర్ ఎన్‌హెచ్ 44 నుంచి రాయకల్ గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాయ‌కల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరానికి 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రతీ ఏటా జాతర కూడా నిర్వహిస్తారు.

 

Exit mobile version