ఓరుగల్లు అంటే మనకి గుర్తొచ్చేది కాకతీయుల పాలన అని చెప్పవచ్చు. మరి ఆ కాకతీయ మహారాజులు రామప్ప ఆలయంలో కొలువై ఉన్న దేవుడిని ఎంతో పవిత్రంగా ఇష్ట దైవంగా ఆరాధిస్తారు. అలాంటి ఈ రామప్ప కట్టడాన్ని ఎవరు కట్టించారు, ఆ కట్టడం వెనుక దాగి ఉన్న శిల్పకళా నైపుణ్యం ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో, ములుగు దగ్గర ఉన్న పాలంపేట అనే గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా అంటారు. కాకతీయ ప్రభువు గణపతి దేవుని సైన్యాధి పతి అయినా రేచెర్ల రుద్రుడు రామప్ప ఆలయాన్ని కట్టించాడు. అందుకే దీనికి రుద్రప్ప ఆలయం మరియు రుద్రేశ్వరాలయంగా పేరు వచ్చినది.
ఈ కట్టడానికి ఒక వింత అనేది ఉంది. అది ఏంటి అంటే ఈ రామప్ప గుడికి నిర్మించిన రాయిని తీసి ఆ సరస్సులో వేస్తే ఆ రాయి అనేది నీటిలో మునగకుండా పైన తేలుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆలయములోని నల్లరాతి స్తంభాలను తాకితే సంగీత ధ్వనులు వినిపిస్తాయి.
ఈ ఆలయాన్ని రామప్ప అనే ఒక గొప్ప శిల్పకారుడు తన శిల్పకళా నైపుణ్యం తో ఎంతో అధ్బుతంగా గర్భగుడిలో అంతరాయాల ద్వారాల పై మలచబడిన శిల్ప సంపద, వివిధ నాట్యరీతులను, పద్ధతులని మనకి తెలిసేలా మలిచాడు. ఇంకా ఇక్కడ ఉన్న ఆలయభాగంలోని శిల్పం, నాట్య మండపం చుట్టూ ఉన్న నల్లరాతి స్థంభాల మీద కనిపించే శిల్పం, సూక్ష్మాతి స్మూక్ష శిల్పాలు ఇక్కడకి వచ్చిన భక్తులని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఏ ఆలయములో ఏ దేవుడు అంటే ఆ దేవుడి పేరుతో ఆ ఆలయాన్ని పిలుస్తారు. కానీ ఈ ఆలయములో శివలింగం ఉన్నప్పటికీ దీనిని చెక్కిన ప్రధాన శిల్పి అయినా రామప్ప పేరుతో ఈ ఆలయాన్ని పిలవడం మరో విశేషం అని చెప్పవచ్చు.
ఈ ఆలయం ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే ఒక కాలు కొంచెం పైకి ఎత్తి ఉంచి,చెవులు రిక్కించి పరమేశ్వరుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నందిని మనం ఏ దిశ నుండి చూసిన ఆ నంది మన వైపే చూసినట్లు మనకు అనిపిస్తుంది. రామప్ప ఆలయాన్ని అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఇంకా ఈ ఆలయం అంత కూడా ఎర్రని ఇసుక రాతి నిర్మాణం అని అంటారు. ఇంతటి శిల్పకళా నైపుణ్యం ఉన్నదీ కనుకే ఈ రామప్ప ఆలయం ఒక గొప్ప యాత్ర స్థలంగా పేరు గాంచింది.