శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసిద్ధమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగనాయక స్వామిగా పూజలందుకుంటున్నాడు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ నెమలి గుండ్ల అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివాని పుల్లల చెరువుకు పడమరగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల అడవిప్రాంతంలో నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ఉంది. గుండ్లకమ్మ నది బ్రహ్మెశ్వరం వద్ద ఆవిర్భవించి నల్లమల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య జాలువారి నెమలిగుండ్లలోకి చేరుతుంది.
పురాణానికి వస్తే, ఈ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కు పుటమతో ఒక గండమును తవ్వి మట్టిని బయటకి తీయడంతో మరుసటి రోజు సూర్యోదయానికి గుండం జలమయంగా మారిందని ప్రతీతి.
స్థల పురాణానికి వస్తే, నల్లమల కొండలలో ఇసుక గుండమనే చోట చెంచుజాతికి చెందిన బయన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగాదేవి. యుక్తవయస్సువచ్చిన రంగాదేవి తన కులాచారాన్ని ధిక్కరించి, కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్లాడాలని తలంపుతో చెంచుగూడెం వదలి నెమలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయూర మహర్షికి తన మనోగతాన్ని తెలియచేసింది. అప్పుడు మహర్షి సూచన మేరకు ఆమె మనోభిష్ట సిద్ధికోసం చటనే మహర్షితి కలసి ఘోర తప్పస్సు చేసింది. ఎట్టకేలకు వారి తపస్సుకు చలించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై రంగదేవిని భార్యగా స్వీకరించాడు. అలాగే మహర్షి కోరిక మేర కొరకు రంగనాయకస్వామిగా ఇక్కడే వెలయడంతో నెమలిగుండ్ల శ్రీ రంగనాయకస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
అయితే నెమలీముఖ ఆకారంతో ఉన్న మహర్షిచే నిర్మితమైనందున నెమలిగుండం అనే పేరు సార్థకమైంది. అయితే మరే క్షేత్రంలో కనిపించని అరుదైన శుచి, పవిత్రత, గొప్పదనం నెమలిగుండ్ల రంగనాయకస్వామి వద్ద కనబడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే శుచి శుభ్రత లేకుండా ఈ ఆలయం వద్దకు వెళితే తేనెటీగలు దాడిచేస్తాయంటా.
ఈ ప్రదేశాన్ని లక్ష్మణవనంగా కూడా పిలుస్తారు. ఇచట ప్రతి ఏటా చైత్రమాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదీయాలలో మూడురోజుల పాటు ఉపవాసదీక్ష నిర్వహిస్తారు.