శివుడు.. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే దేవుళ్లలో ఒకరు. ఈయనకు చాలా మంది భక్తులు ఉంటారు. ముఖ్యంగా శివున్ని భక్తులు సోమవారం పూజిస్తారు. కొందరు ఆ రోజున మాంసాహారం తినరు. దీనికి తోడు ఉపవాసం కూడా ఉంటారు. అయితే మిగిలిన దేవుళ్లు, దేవతలను వారి వారి రూపాల్లో ఉన్న విగ్రహాలను, చిత్రాలను పూజిస్తారు కానీ శివున్ని మాత్రం లింగం రూపంలో మాత్రమే భక్తులు పూజిస్తారు. ఎక్కడ శివాలయానికి వెళ్లినా అక్కడ శివుని విగ్రహం ఉండదు. కేవలం లింగం మాత్రమే ఉంటుంది. అయితే ఈ శివలింగం గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవేంటో ఇపుడు చూద్దాం..
శివలింగం అంటే కేవలం లింగం మాత్రమే కాదు, ఇది మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. కింది భాగం బ్రహ్మ దేవుని రూపంగా, మధ్యభాగం విష్ణు రూపంగా, పై భాగం శివరూపంగా భావిస్తారు. ఇక లింగం కింద ఉండే భాగాన్ని యోని అంటారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. లింగం-యోనిల సంగమమైన శివలింగం విశ్వానికి ప్రతీక అని భావిస్తారు. సమస్త విశ్వం అందులో ఉంటుందట. అనంతమైన ఐక్యతకు, జీవోద్భావనకు అది సూచిక అని అంటారు. అదేవిధంగా శివలింగంలో ఉండే లింగం, యోని భాగాలు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అవయవాలను సూచిస్తాయి.
లింగం అంటే పురాణాల్లో నాశనం లేనిదని, స్థిరమైందని, దృఢమైందని, మన్నికైందనే అర్థాలు చెప్పారు. ఇవన్నీ కలిసి ఉన్న భాగం లింగమని అన్నారు. ఇది అనంతమైన శక్తిని జనింపజేస్తుందని విశ్వాసం. అందుకే శక్తిని పొందాలంటే లింగాన్ని పూజించాలని చెప్పారు. ఓం నమఃశివాయ అనే మంత్రం పఠించి శివున్ని పూజిస్తే లింగారాధాన చేసినట్టు అవుతుందట. దీంతో సాక్షాత్తూ శివుడిలోని శక్తి భక్తుల్లోకి చేరుతుందని నమ్ముతారు. అయితే వివాహం కాని యువతులు శివున్ని పూజించరాదట. అయితే వారు పార్వతీ దేవితో కలసి ఉన్న శివున్ని పూజించవచ్చట.
దీంతో వారికి మంచి భర్త దొరుకుతాడట. ఇలా వారు 16 సోమవారాల పాటు ఉపవాసం ఉండి శివారాధన చేస్తే చాలా మంచి జరుగుతుందట..!