మన దేశంలో ఉన్న విష్ణువు ఆలయాలలో ఇది ప్రముఖమైనదిగా చెబుతారు. ఈ ఆలయాన్ని విష్ణుకంచి అని కూడా అంటారు. ఆలయంలో వెలసిన స్వామివారిని వరదరాజస్వామిగా పిలుస్తారు. ఇక్కడి ఆలయంలోని గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం దేశంలోనే రెండవ అతిపెద్ద విగ్రహాంగా చెబుతారు. ఈ ఆలయంలో 40 సంవత్సరాలకి ఒకసారి కోనేటిలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని తీసి 48 రోజులు దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే చివరగా 1979 లో కోనేటి నుండి విగ్రహాన్ని తీశారు, మళ్ళీ 2019 జులై లో స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రంలోని, కాంచీపురం జిల్లా, విష్ణుకంచి ప్రాంత మందలి కరిగిరి అను ఎత్తైన గుట్ట మీద శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. సిద్ధాంతకర్త రామానుజులు ఈ ఆలయంలోని నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బంగారు, వెండి బల్లులు కలవు. ఈ దేవాలయంలో వెయ్యి స్థంబాల మండపం ఉంది.
ఇక్కడి వరదరాజస్వామిని కృతయుగంలో బ్రహ్మదేవుడు, తేత్రాయుగంలో గజేంద్రుడు, ద్వాపరయుగంలో బృహస్పతి, కలియుగంలో అనంతశేషుడు పూజించారని చెబుతారు. ఈ ఆలయానికి పశ్చిమవైపు న, 96 అడుగులతో 7 అంతస్తులుగా నిర్మించబడిన గాలిగోపురం ఉన్నది. గర్భాలయంలోని స్వామివారు చతుర్భుజుడై పశ్చిమ ముఖంగా కొలువుదీరినాడు.
ఈ దేవాలయం ప్రాంగణంలో ఆనంద సరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో నీటిలోపల అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవత మూర్తి విగ్రహం ఉంది. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి కోనేరులో నుంచి తీసి 48 రోజులు దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే 2019 వ సంవత్సరంలో జూన్ నెలలో అత్తి శ్రీ వరదరాజ పెరుమాళ్ ను భక్తులు దర్శనం చేసుకోవచ్చును. అంటే జులై 1 వ తేదీ నుండి ఆగస్టు 18 వరకు 48 రోజుల పాటు భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఇక ఇదివరకు 1939 లో 1979 లో 40 సంవత్సరాలకు ఒకసారి ఈ దర్శనం అనేది జరుగగా, 2019 లో స్వామివారి అద్భుత దర్శనం అనేది జరుగనుంది. అయితే 48 రోజుల దర్శనం అనంతరం అత్తి దేవత మూర్తి విగ్రహాన్ని తిరిగి కోనేటిలో వేయగా స్వామివారు తపోస్థితిలోకి వెళుతారు.