శివునికి సంబంధించిన గాథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. వీరభద్రుని ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే ఈ దక్షయజ్ఞాన్ని తలుచుకోవలసిందే.దక్షునికి మొదటినుంచీ పరమేశ్వరుడు అంటే గిట్టేది కాదు. కానీ ఆయన కుమార్తె సతీదేవి మనసు మాత్రం శివుని మీదే లగ్నమై ఉండేది. ఆమెను శివునికి కాకుండా వేరేవాళ్లకి కట్టబెట్టేందుకు దక్షుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆఖరికి సతీదేవి వివాహం చేసేందుకు, శివుని తప్ప మిగతా దేవతలందరినీ స్వయంవరానికి పిలిచాడు దక్షుడు. కానీ అక్కడ శివుని శిల్పం మెడలోనే తన పూలహారాన్ని వేసి, తన మనసులో శివునికి తప్ప అన్యులకు స్థానం లేదని చెప్పకనే చెప్పింది సతీదేవి. ఇక దక్షునికి కుమార్తె ఇష్టానుసారం వివాహం చేయడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది.
శివుని తన అల్లునిగా చేసుకున్నప్పటికీ, అతనని ఎలాగైనా అవమానించాలన్న సంకల్పంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే దక్షుడు యజ్ఞము చేయ సంకల్పించి దేవతలు, రాక్షసులతో సహా సమస్త లోకానికి ఆహ్వానం పంపి తన అల్లుడైన పరమేశ్వరునిపై గల చులకన భావంతో శివునికి మాత్రమే ఆహ్వానం పంపడు. దీనికి బాధ పడ్డప్పటికీ సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న కోరికను భర్త అయిన పరమేశ్వరుని వద్ద ప్రస్తావిస్తుంది.
దానికి పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్ళడం సముచితం కాదని సతీదేవిని వారిస్తాడు. కాని తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న గాఢమైన కోరిక కలిగిన సతీదేవి వెళతానని పట్టుబడుతుంది. చివరికి భార్య మాట కాదనలేక పరమేశ్వరుడు సమ్మతించి ప్రమథగణాలను తోడిచ్చి దక్షుని యజ్ఞానికి సతీదేవిని పంపుతాడు.
యజ్ఞానికి వచ్చిన సతీదేవిని గమనించిన దక్షుడు అనేకమైన పదజాలంతో పరమేశ్వరుని దూషిస్తాడు.జరిగిన ఆవమానం భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో పడి కాలిపోతుంది. సతీదేవి ఆత్మాహుతి గురించి విన్న పరమేశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. తన కేశాన్ని పెరికి నేలకేసి కొట్టాడు. అప్పుడు ఉద్భవించిన ఉగ్రరూపమే వీరభద్రుడు. ఆకాశమంత ఎత్తున, కారుమేఘపు చాయతో, పదులకొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రడు. ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రాకాళి. దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని అజ్ఞాపించిడమే ఆలస్యం. ప్రమథగణాలతో కలిసి వారిరువురూ విధ్వంసాన్ని సృష్టించారు.
దక్షుని రాజ్యంలో వీరభద్రుడు వేసిన వీరంగం అంతాఇంతా కాదు. అడ్డువచ్చిన వారికి ఘోర అవమానమే ఎదురైంది. చంద్రుడు, అగ్ని, పూషుడు ఎవ్వరూ వీరభద్రుని ఆపలేకపోయారు. మెడలో కపాలమాలతో వీరభద్రడు, నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ ఆ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర యుద్ధం జరిగింది.
ఆ పోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కానీ వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకు వెళ్ళాడు. వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలు తప్పుకున్నారు. దక్షుని మీద వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు అవకాశాన్నిచ్చారు. అంతట వీరభద్రుడు కసితీరా దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.