వేప చెట్టు క్రింద బురుజు గోడలో స్వయంభువుగా వెలసిన మైసమ్మ తల్లి

0
8361

ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారని ప్రతీతి. అమ్మవారు వెలసిన శక్తివంతమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయం ఎక్కడ వెలసింది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gandi maisammaతెలంగాణ రాష్ట్రంలోని, మహబూబ్ నగర్ జిల్లాలోని, ఆమనగల్లు మండలం, హైదరాబాద్ నుండి సుమారు 50 కీ.మీ. దూరంలో కర్నూలు వెళ్లే రహదారిలో మైసిగండి అనే గ్రామంలో గండి మైసమ్మ ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో ఒక వేప చెట్టు క్రింద బురుజు గోడలో స్వయంభువుగా మైసమ్మ తల్లి వెలసింది. ఈ తల్లి కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలసిందిగా పురాణాలూ చెబుతున్నాయి.

gandi maisammaఈ గ్రామంలోని ప్రజలు ఈ తల్లిని గ్రామ దేవతగా కొలుస్తారు. ఈ మైసమ్మ చుట్టూ పక్కల గ్రామాలలోని ప్రజలందరికి ఆరాధ్య దైవంగా పూజలందుకొనుచున్నది. భక్తుల పాలిట కొంగుబంగారమై కోరిన కోరికలు తీర్చే అమ్మగా ఈమెను కొలుస్తారు. ఈ ఆలయంలో సృష్టి స్థితి లయకారిణి అయి కాళికాదేవి స్వరూపంతో పూజలనందుకొంటుంది.

gandi maisammaమైసమ్మను అర్చించినవారు సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లుతారనే గొప్ప నమ్మకం ఈ ప్రాంత ప్రజల్లో బలంగా ఉంది. మైసమ్మ విగ్రహం ప్రతిష్టించక ముందు ఇక్కడ చిన్న శిలావిగ్రహం ఉండేది. కొంతకాలం తరువాత ఒక భక్తుడు ఈ మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.

gandi maisammaమైసమ్మ దేవాలయానికి కొంత దూరంలో శివాలయం, రామాలయం, అన్నపూర్ణేశ్వరి దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాచీన దేవాలయాలను గోల్కొండను పాలించిన తానిషా వద్ద మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాధన్నలు నిర్మించినట్లుగా చెబుతారు. అయితే ఈ ఆలయాలకు ఎదురుగా ఒక గండి (కోనేరు) ఉంది. ఈ గుడికి ఎదురుగా మైసమ్మ ఉన్నందున ఈ ప్రాంతానికి మైసిగండి అనే పేరు స్థిరపడింది.

gandi maisamma
ప్రతి ఆదివారం, గురువారాలలో వేల సంఖ్యలో భక్తులు ఈ మైసమ్మను దర్శిస్తుంటారు. అన్నివర్గాల ప్రజలచే నిత్యం పూజలు అందుకుంటూ ఈ దేవత మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే జాతరకు భక్తులు విశేషంగా వస్తారు.

6 vepachettu kindha velasina gandi maisamma alaym visheshalu