కాలానుగుణంగా దొరికే ప్రతీ పండు ఆరోగ్యానికి దివ్యఔషధంలా పనిచేస్తుంది. అందులో శీతాకాలంలో విరివిగా వచ్చే పండ్లలో రేగుపండ్లు ముఖ్యమైనవి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే పండ్లు కూడా ఇవే. రేగుపండ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్ మారిటియానా, నార్కెలి కల్, బెర్, బోరీ, బోర్, బెరి అని అనేక రకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు.
మహాభారత ఇతిహాసంలో.. భారతీయ నాగరికతలో హిందువుల పూజల్లోనూ పాలు పంచుకుంటున్న వృక్షజాతుల్లో బదరీ వృక్షం ఒకటి. రేగుపండును బదరీఫలం అంటారు. భగవంతుడికి నివేదించే పండ్లలో రేగుపండు ఒకటి. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి సమయంలో పిల్లలకు పోసే భోగిపండ్లూ కూడా రేగిపండ్లే.
దోరగా, ఎర్రగా నోరూరిస్తూ ఉండే రేగుపండు మంచి ఔషధకారి. రేగుపండులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాలా మంచిది. గొంతునొప్పిని, ఆస్తమా, కండరాల నొప్పిని తగ్గించే గుణం వీటిలో ఉంది. రేగు పండు గింజ చాలా గట్టిగా ఉంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఈ చిన్న రేగు పండ్లు… పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుండి రేగు పండ్లు మనల్ని కాపాడతాయి. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి అవసరం.
రేగు పండ్లలో ఉండే గుజ్జు ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరుకు టానిక్లా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. రక్త నాళాలను శుభ్రపరిచి గుండెకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. అంతేకాదు నరాల ఒత్తిడిని, మొలల వ్యాధిని తగ్గిస్తోంది. కండరాల పటుత్వాన్ని పెంచడంలో తోడ్పడుతుంది.