పురాణాల్లో దేవానుదేవతలు లింగాన్ని ప్రతిష్టించి భక్తితో పూజించి తరించారు. ఏ సమయంలో ఎటువంటి లింగాన్ని పూజించాలి అనే విషయం మీద మనలో చాలా మందికి అవగాహనా తక్కువ. దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న లింగాన్ని పూజిస్తున్నాం. నిజానికి ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరి ఎవరు ఎటువంటి లింగాన్ని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు.
లింగపురాణాల ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీ పూజించుకోవాలి. అయితే స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూజించుకోవచ్చు.
వాటివల్ల వచ్చే ఫలితం:
ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందోనన్న విషయాలు లింగపురాణంలో వివరించి ఉంది. దాని ప్రకారం రత్నాజ శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతోపాటు వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.
ఎప్పుడు పూజించుకోవాలి:
- వైశాఖంలో వజ్రలింగాన్ని,
- జ్యేష్టంలో మరకత లింగాన్ని,
- శ్రావణంలో నీలపు లింగాన్ని,
- భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని,
- ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని,
- కార్తికంలో ప్రవాళలింగాన్ని,
- మార్గశిరంలో వైడూర్య లింగాన్ని,
- పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని,
- మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని,
ఫాల్గుణంలో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.