గత సంవత్సరంన్నర కాలంగా కరోనా మహమ్మారివల్ల ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. నలుగురిలో మెసలే అవకాశం లేకపోవడం, భౌతిక దూరం పాటించడం, స్వీయ నిర్బంధం వంటి నిబంధనలు పౌరుల్లో మానసికంగా ఒత్తిడి పెంచుతున్నాయి. సమాజంలో అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది. మరోవైపు ఈ మహమ్మారి బంధాలను సైతం చిదిమేస్తోంది. మనుషుల ప్రాణాలు తీయడమే కాదు.. మానవత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది.
బతికి ఉన్నప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగినవారు.. మరణించాక మృతదేహం వద్దకు వచ్చేందుకు కూడా సాహసించటం లేదు. ఎంతటి ఆత్మీయులు దూరమైనా సరే చివరిచూపు కోసం వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నరు. వైరస్తో సచ్చిపోతే కనీసం పాడె మోసేందుకు కూడా నలుగురు ముందుకు రాలేని దుస్థితి వచ్చింది. ఆఖరికి కన్నవారు మరణించినా.. వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా వెనుకడుగు వేసేలా భయపెడుతోంది.
అలా చాలామంది తమవారి మృతదేహాలను అనాథ శవాలుగా వదిలేసిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక కోవిడ్-19 సోకి చనిపోయిన వ్యక్తి ఏ మతం వారైనా సరే, శవాన్ని ఖననం చేయవద్దని, తప్పనిసరిగా దహనం చేయాలని ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలతో కరోనావైరస్ సంక్షోభం కాస్తా మతపరమైన మలుపు తీసుకుంది. కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి.
అయితే చనిపోయిన తరువాత శరీరంలో కరోనా వైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది అనే ప్రశ్న చాలా మందిలో మెదిలింది. కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా లేదా అని జనాలు భయపడుతున్న ఈ సమయంలో ఎయిమ్స్ ఫొరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా కీలక విషయాన్ని వెల్లడించారు. కరోనా వలన మరణించిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12 నుంచి 24 గంటలకు మించి కరోనా వైరస్ బతకలేదని స్పష్టం చేశారు. నిరభ్యంతరంగా అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని తెలిపారు. కరోనాతో మరణించిన వ్యక్తులకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు జరిపించాలన్న ఉద్దేశ్యంతోనే ఎయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ గత ఏడాది కాలంగా ఓ అధ్యయనం చేసింది.
కరోనాతో మరణించిన వారి 100కు పైగా మృతదేహాలను పరీక్షించారు. వైరస్ బారిన పడి మరణించిన ఒక్కో వ్యక్తి మృతదేహానికి 12, 24 గంటల వ్యవధిలో రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. అప్పుడు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన 12 నుంచి 24 గంటల తర్వాత ఆ వ్యక్తి మృతదేహం నుంచి కరోనా వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ. కాకపోతే మృతదేహం ముక్కు రంధ్రాలు, నోరు, మూసేయడం, బతికి ఉన్నప్పుడు రోగికి అమర్చిన వివిధ పైపులను తీసి శానిటైజ్ చేయడం మంచిది. అంత్యక్రియలు ముగిసిన అనంతరం.. చితాభస్మం సేకరించడం పూర్తిగా సురక్షితమేనట. ఆ సమయంలో కరోనా వ్యాప్తికి ఆస్కారమే లేదన్నారు. మే 2020లో కొవిడ్-19 మృతదేహాలకు సంబంధించి పోస్ట్మార్టం చేయడంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది.
కరోనా మృతదేహాలకు పోస్ట్మార్టం చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. పోస్ట్మార్టం చేయడం ద్వారా..మార్చురీ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల జీవితాలను.. ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్మార్టం చేయాల్సి వస్తే.. సరైన రక్షణతో వీలైనంత తక్కువ పనితో ఆ తంతు ముగించాలని తెలిపింది మృతదేహాన్ని ఖననం చేస్తే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ, మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి. మతపరమైన ఆచారాలను గౌరవించిన ఆరోగ్యశాఖ ఆదేశాలు మీరకూడదు.