ప్రెగ్నన్సీ సమయంలోనే కాదు డెలివరీ తరువాత కూడా మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డెలివరీ తరువాత మహిళల శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మరియు డెలివరీ తరువాత కేవలం తమ అరోగ్యాన్ని మాత్రమే కాదు, పుట్టిన పసికందు అరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోని ఆహారాన్ని తీసుకోవాలి.
బరువు త్వరగా తగ్గిపోదామని డైట్ మార్చేయకూడదు. అలా చేస్తే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పిల్లలకి పాలు పట్టాలి కాబట్టి, పాల ఉత్పత్తిని పెంచే ఆహారాలు, పోషకాలు ఎక్కువ ఉండే అహారాన్ని తీసుకోవాలి.
అవేంటో ఇప్పుడు చూద్దాం…
మంచినీళ్ళు :
పాలుపట్టే తల్లులు డిహైడ్రేట్ అవకూడదు. అంటే మంచినీళ్ళు బాగా తాగాలి. పండ్లరసాలు ఎక్కువగా తోసుకోవాలి. అయితే ద్రవ పదార్థాలే కదా అని టీ, కాఫీ లాంటివి ఎక్కువ తాగేయొద్దు.
గ్రీన్ వెజిటబుల్స్ :
పాలు పట్టే తల్లులకు ఐరన్ చాలా అవసరం. కాబట్టి ఆకుకూరలు, బీన్స్, మెంతి వంటి గ్రీన్ వెజిటబుల్స్ ని డైట్ లో చేర్చుకోవాలి.
కోడిగుడ్డు :
కోడిగుడ్డుని కూడా బాలింతలు తమ డైట్ లో చేర్చుకోవాలి. గుడ్డు శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ ను అందజేస్తుంది. అయితే గుడ్డుని ఆమ్లేట్ వేళుకొని కాకుండా ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం మంచిది.
నారింజ :
డిలివరీ అయిన మహిళలకి విటమిన్ సి చాలా అవసరం. ఇది నారింజలో ఎక్కువగా లభిస్తుంది.
నారింజతో పాటు ఇతర సిట్రస్ పండ్లను కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ తినడానికి బద్ధకంగా ఉంటే జ్యూస్ చేసుకోని తాగితే మంచిది.
బ్రౌన్ రైస్ :
బ్రౌన్ రైస్ కూడా డైట్ లో చేర్చుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన క్యాలరీలు తెచ్చిపెట్టి, పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి మాత్రమే కాదు, బ్లూ బెర్రిస్, చికెన్, చేపలు, బాదాం, వాల్ నట్స్, మజ్జిగ, ఉసిరి లాంటివి కూడా పాలు పట్టే తల్లులకు, తద్వారా పాలు తాగుతున్న పసివాళ్ళకు మంచివి.
మరి బాలింతలు ఎలాంటి ఆహరం తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…
వేరు శనగ:
వేరు శనగను బాలింతలు తీసుకోకూడదు. ఎందుకంటే వేరుశనగ బిడ్డకు అలర్జీని కలిగిస్తుంది. వీటిలో పోషక విలువలు ఉన్నప్పటికీ బిడ్డకు పాలిస్తున్న తల్లి నట్స్ వంటి ఆహారాలను తీసుకోవడం వలన పిల్లలకు అలర్జీలు వచ్చి ఇబ్బందిని కలిగిస్తాయి.
కాఫీ:
గర్భం సమయంలోనూ కాఫీకి దూరంగా ఉండాలని చెబుతారు. అలాగే ప్రసవం తర్వాత కూడా కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ తీసుకోవడం వలన తల్లి, బిడ్డకు నిద్రేలేమిని కలిగిస్తాయి. అందుకే వైద్యులు కూడా కాఫీ వద్దని చెబుతుంటారు.
వెల్లుల్లి:
పాలిచ్చే తల్లులు వెల్లుల్లి ఎక్కువగా ఉండే ఆహారం, వెల్లుల్లిని తీసుకోవడం వలన తల్లి పాలు తాగే బిడ్డకు పాల నుండి వచ్చే ఘాటైన వాసన కారణంగా పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు వారిలో వికారం మొదలై వాంతులు వచ్చే ప్రమాదం ఉంది.
పెరుగు:
చాలావరకు వైద్యులు బాలింతలను పెరుగు కొన్ని నెలల పాటు వద్దని చెబుతుంటారు. తల్లి పెరుగు తీసుకోవడం వలన తల్లి పాలలో కలిసి బిడ్డకు జలుబు చేస్తుందని చెబుతుంటారు.
చాక్లెట్స్:
పాలిచ్చే తల్లులు చాక్లెట్స్ తీసుకోవడం వలన వీటిలో ఉండే కెఫీన్ మరియు సోడా తల్లి, బిడ్డ శరీరంలో చేరి మంచి నిద్రను దూరం చేస్తాయి.
వీటితోపాటు మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, మద్యం, పెప్పర్ పదార్థాలు, గోధుమలు, బ్రోకలీ, ధూమపానం చేయడం, చేసేవారి పక్కన ఉండటం, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం, డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా సొంతంగా మందులు తీసుకోవడం చేయకూడదు.