Home Unknown facts గాంధారి శాపం వెనుక ఉన్న అసలయిన రహస్యం ఏమిటి ?

గాంధారి శాపం వెనుక ఉన్న అసలయిన రహస్యం ఏమిటి ?

0

మహా భారతంలోని ప్రతీ సంఘటన మనిషి జీవితానికి ఒక గుణపాఠమే. అలాంటి ఒక సంఘటనే గాంధారి శాపం. కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. ఇంత దారుణం జరిగినా తమకు చావురాలేదు అని బాధపడుతున్న ధృతరాష్ట్రుని వ్యాసమహాముని ఓదారుస్తూ… నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?” అన్నాడు.

Maha Bharathamవ్యాసుని మాటలకూ ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారినీ, కుంతినీ, కోడళ్ళనూ వెంటపెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు. పెదతండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు. అతని వెంట తమ్ములూ ద్రౌపదీ కృష్ణుడూ కూడా వున్నారు.

ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారు. దుఃఖంతో, అవేశంతో పేరుపేరునా పాండవులందర్నీ నిందించారు. వాళ్ల మాటలకూ కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణసహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు.

కానీ కోపంతో ఉన్న గాంధారి వారిపై మండిపడింది. “శత్రువుల్ని చంపొచ్చు. కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణయినా మిగల్చకుండా అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం చెయ్యనివాడు వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టేపెడితే మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? అ ఒక్కడూ మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా? ఇంతకూ ఏడీ మీ మహారాజు?” అంటూ ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది.

ఆమె ప్రశ్న పూర్తవగానే ధర్మనందనుండు ఆమె ముందు మోకరిల్లాడు. గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ళ మీద పడింది. ఆ గోళ్ళు వెంటనే ఎర్రగా కందిపోయాయి. అది చూసి హడలిపోయి అర్జునుడు వెళ్లి కృష్ణుడి వెనకాల దాగాడు. కానీ మహాజ్ఞానీ, సంయమనం కలదీ కనుక గాంధారి తన కోపాన్ని శమింప చేసుకుని నాయనా! వెళ్ళి కుంతీదేవిని చూడండి అంది. కానీ ఇంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల మాత్రం ఆమె కోపం కట్టలుతెంచుకుంది. వాసుదేవుడిని పిలిచి, కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పలేకపోయావా? కదన రంగాన కాలిడినప్పుడు నువ్వు అడ్డుపడలేకపోయావా? సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు.

జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను – నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కుల స్తీలు కూడా ఇలాగే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగుగాక” అని శపించిండి గాంధారి.

ఆమె మాటలకు మనసులో బాధపడినా పైకి మాత్రం చిరునవ్వు నవ్వు చూపిస్తూ…అమ్మా! ఈ శాపం యాదవులకు ఇదివరకే కొందరు మునులు ఇచ్చారు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచస్తారు. పోనీలే కానీ అందువల్ల నీకేం వస్తుంది చెప్పు? అన్నాడు నవ్వుతూనే. పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో అచ్యుతుని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది. జరిగినదంతా లోకకళ్యాణం కోసమే అని గ్రహించి కంటనీరు పెట్టింది.

 

Exit mobile version