పూర్వం యుద్ధంలో దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వల్ల ఓడిపోయి గురువైన శుక్రాచార్యుడిని శరణువేడుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత గురుకృప వల్ల బలి స్వర్గముపై అధికారము సంపాదించాడు. దీంతో అధికారం దూరం అయి ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి బాధతో పయోవ్రతము ప్రారంభించింది.
ఆ వ్రత చివరిరోజున విష్ణుమూర్తి ప్రత్యక్షమై అదితితో “దేవీ.. బాధపడకు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి శుభం చేకూరుస్తాను అని చెప్పి అదృశ్యమవుతాడు. ఇలా అదితి గర్భంలో భగవానుడు వామన రూపంలో జన్మించాడు. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషానికి అవధుల్లేవు. భగవానుని వామనునిగా బ్రహ్మచారి రూపంలో దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో సంతోషించారు. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు జరిపించారు.
ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను ప్రదేశంలో అశ్వమేధ యజ్ఞము చేస్తున్నాడని వామనభగవానుడు విని అక్కడికి వెళ్ళాడు . ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, తలమీద జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపంలో యజ్ఞమండపములో ప్రవేశించాడు.
అంతటి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణుని చూసిన బలి మనసు పులకించింది. వామన భగవానుడిని ఆసనంపై కూర్చోబెట్టి సత్కరించాడు. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. “వామనుడు మూడు అడుగుల భూమి”ని అడిగాడు. శుక్రాచార్యుడు భగవానుని లీలలను కనిపెట్టి, దానము వద్దని బలికి ఎంత చెప్పినా బలి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానం చేయడానికి సంకల్పపాత్రను సిద్ధం చేసాడు.
శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్రలో ప్రవేశించి నీరు వచ్చే దారికి అడ్డుపడ్డాడు. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని శుభ్రంచేసాడు. దీంతో శుక్రాచార్యునికి ఒక కన్ను పోయింది.
సంకల్పం పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును భూమిని, రెండవ పాదముతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ పాదము ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడిగాడు . వెంటనే బలి తన తలను స్వామికి సమర్పించాడు ,మూడో అడుగు బలి నెత్తిన పెట్టి పాతాళానికి తొక్కేసాడు వామనుడు. బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము ప్రసాదించాడు.