యంత్రము అంటే ముందుకు వెళ్లేవి, ముందుకు నడిపించేవి అని అర్ధం. అంటే ఎవరైతే ఒక దైవ యంత్రాన్ని ఆరాధిస్తారో వారికి భగవదానుగ్రహం కలుగుతుంది. ఈ లోకంలోని సర్వశక్తులు ఆదిశక్తి నుండి ఉద్భవించాయి. అలాంటి విశ్వజననికి ఒక నిర్ధిష్ట రూపంలేదు.
అయితే ధ్యానశక్తితో ఆ రూపాన్ని దర్శించిన రుషులు ఒక యంత్రరూపం మనకు ప్రసాదించారు. ఈ యంత్రం రేఖలు, వృత్తాలు, త్రిభుజాలుగా ఈ సువిశాల విశ్వానికి ప్రతిబింబంగా రూపొందించారు. అమ్మవారి లలితా సహస్రనామాలకు మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాసనాలని అమ్మవారి నామాలకి చెప్పబడుతుంది అంటే అన్ని యంత్రములకు ప్రతినిధి ఆ అమ్మవారే.
అంతేకాదు భగవంతుని ప్రాణ శక్తి యంత్రరూపంగా ఉంటుంది. ఏ దేవాలయం నిర్మాణం జరిగినా ధ్వజస్ధంబం నిలబెట్టినా, దేవతా విగ్రహం ప్రతిష్టకంటే ముందు యంత్ర ప్రతిష్ట చేస్తారు. కారణం యంత్రానికి ఉండే అమోగమైన శక్తి ఆ దేవతామూర్తిలో ప్రవేశించి అమోగమైన చైతాన్యాన్ని కల్గిస్తుంది.
ఈ యంత్రాలు బంగారు రేకుల మీద, వెండి మీద, రాగి మీద, అరతి ఆకుమీద, ఇంకా కాగితం మీద కూడా గీస్తారు. యంత్రం అవసరం ఉపయోగాన్ని బట్టి దేనిమీద గీయాలో మంత్ర గ్రంధాలు తెలుపుతున్నాయి.
అయితే శక్తివంతమైన ఈ యంత్రాలను ఇంట్లో పెట్టుకోవచ్చా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. నిజానికి వెండి, రాగి, ఇత్తడి తదితర పంచలోహాలతో చేసే యంత్రాలను పూజా మందిరంలో వుంచిది, నిత్య పూజాధికాలు చేసే పద్ధతి వుంది.
ఈ యంత్రాలపైన రేఖల రూపంలో, బీజాక్షరాలతో దైవీశక్తిని ఆవాహనం చేస్తారు. యంత్రాల తయారీలో ఎంతో నిబద్ధత, జాగరూకత కావాలి. కేవలం యంత్రం పైన రేఖలు, అలంకారం వుంటే సరిపోదు. సంబంధిత దేవత మంత్రాలను పునశ్చరణ చేసి యంత్రాలకు ప్రాణప్రతిష్ట చేసినప్పుడే వాటిలోని దైవీశక్తి కొలువుంటుంది. అలా చేయని యంత్రాలు అలంకారప్రాయంగానే నిలుస్తాయి. అందుకే ఇంట్లో యంత్రాలు ఎక్కువగా పెట్టుకోవద్దు. ఉన్నా అంగుష్ట మాత్రం పైకి విగ్రహాలు ఉండకూడదు. వాటికి రోజు నిత్య నైవేద్యం అభిషేకం అనుష్టానం ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ యంత్ర బలం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఇంట్లో యంత్రాలు పెట్టుకుంటే నిష్టనియమాలతో పూజ చేయాలి. నిత్య నైవేద్యం ఉండాలి. అందుకే ఇంట్లో ఎక్కువ యంత్రాలు పెట్టుకుంటే నష్టదాయకం అని సూచిస్తున్నారు పండితులు.