మనహిందు సంప్రదాయంలో దేవాలయాలు ఎక్కువ కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, నదీ పరీవాహక ప్రాంతాల్లో, లేదా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రకృతి సోయగాల మద్య ఉంటాయి. కానీ ఒక దేవాలయం మాత్రం భయంకరమైన అలల మద్యన సముద్ర తీరం వెంట 3 కి . మీ. లోపల ఉంది. ఇక్కడ స్వామిని దర్శించికుంటే సకల పాపాలూ పోతాయని భక్తుల నమ్మకం. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో, విశేషాలేంటో చూద్దాం.
ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో, భావ్ నగర్ కు 23 కి.మీ దూరంలో అరేబియా సముద్ర తీరం వెంట కొలియాక్ గ్రామ సమీపంలో సముద్రం మధ్యలో ఉంది. ఇక్కడ ఉండే పరమేశ్వరుడిని పాండవులు మహాభారత యుద్ద సమయంలో బద్వర అమావాస్య రోజు రాత్రి నిర్మించి, వారి పాపాలను, దోషాలను పోగొట్టుకున్నారని పురాణ గాథ. అందుకే ఈ స్వామిని నిష్కలంక్ మహదేవ్ అని పిలుస్తారు.
అయితే ఇక్కడికి వచ్చే టూరిస్టులు చూడటానికి ఉదయం పూట ఎటువంటి ఆలయం కనపడదు. ఎందుకంటే ఇక్కడి ఆలయం సముద్ర తీరం నుండి 3 కి మీ లోపలికి వెలసింది. ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు అలల ఉదృతి తగ్గి మెల్లగా జెండాలతో ఓ స్తూపం, ఐదు శివ లింగాలు కనపడతాయి. అప్పుడు భక్తులు వెళ్ళి పూజలు చేస్తారు. అమావాస్య, పౌర్ణమి, మహాశివరాత్రి ఇలా ప్రత్యేక రోజుల్లో విశేష పూజలు చేస్తారు.
మరణించిన తమవాళ్ళ అస్థికలు ఇక్కడ సముద్రం లో కలిపితే వారి ఆత్మ శాంతిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి అధిక సంఖ్యలో జనం వస్తారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి సముద్రుడు వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు స్వామిని దర్శించుకోవచ్చు.
అంతే కాదు వర్తకులు తమ వ్యాపారాలను కూడా చేసుకుంటారు. అయితే ఇక్కడ సముద్రం లోపల ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారని ఇప్పటి ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అర్దం కావడం లేదు. తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.